Palle Prakruit Vanam | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో అధికంగా మొక్కలు నాటి పచ్చదనం పరిఢవిల్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు. చేవెళ్ల మండల పరిధిలోని 37 గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల్లోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి లక్ష్యానికి మించి మొక్కలు నాటి పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
– చేవెళ్ల రూరల్, మే 21
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గతంలో లేని విధంగా ప్రస్తుతం ఆకుపచ్చ గ్రామాలుగా దర్శనమిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు లక్ష్యానికి మించి నాటిన మొక్కలు నీడనిస్తూ, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రతి రోజూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా మొక్కలకు నీరు పోస్తూ, వాటి మధ్యలో మొలచిన కలుపు మొక్కలను వన సంరక్షకులు తొలగిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
హరితహరంలో భాగంగా లక్ష్యానికి మించి మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతున్నది. అధికారుల పర్యవేక్షణ, ప్రత్యేక చొరువతో ముందుకు సాగుతున్నాం. గ్రామస్తులను వారి ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రతి మొక్కనూ కంటికి రెప్పలాగా కాపాడుతున్నాం.
– గాయత్రీగోపాలకృష్ణ, కౌకుంట్ల సర్పంచ్
గ్రామంలో రోడ్లకిరువైపులా నాటిన మొక్కలతో పాటు పల్లె ప్రకృతి వనాలు, పంచాయతీ కార్యాలయాల్లో నాటిన ప్రతి మొక్కనూ కాపాడుతున్నాం. మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేశాం. సిబ్బంది ఎప్పటికప్పుడు మొక్కలకు నీరు పోసి సంరక్షిస్తున్నారు. అవి ప్రస్తుతం ఏపుగా పెరిగి మంచి వాతావరణాన్ని అందిస్తున్నాయి.
– విజయలక్ష్మీనర్సింహులు, ఆలూర్ గ్రామ సర్పంచ్
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో పచ్చదనం పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి ఏటా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటడంతోపాటు ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మొక్కల సంరక్షణలో అందరూ భాగస్వాములవ్వాలి.
– రాజ్కుమార్, ఎంపీడీవో, చేవెళ్ల