ఒకప్పుడు ఉన్నత విద్య నగరాలకే పరిమితం కాగా.. సీఎం కేసీఆర్ చొరవతో నేడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకూ అందుబాటులోకి వస్తున్నది. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రజల చెంతకే నాణ్యమైన వైద్యాన్ని చేర్చుతున్నారు. అనంతగిరిలో ఏర్పాటు చేసిన వికారాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలను శుక్రవారం సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం లెక్చర్హాల్-2 భవనంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్థానిక ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
-వికారాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన ప్రత్యేక జిల్లా ఏర్పాటుతోపాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల 50 ఏండ్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతగిరిలో ఏర్పాటు చేసిన జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీని సీఎస్ శాంతికుమారి, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించి, మెడికల్ కాలేజీ విద్యార్థులు, సిబ్బందికి అభినందనలు, శుభాశీస్సులు అందజేశారు. తదనంతరం అనంతగిరిలోని లెక్చర్ హాల్-2 భవనంలో కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, పట్నం నరేందర్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డిలతో మంత్రి మహేందర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన చేశారు.
మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, అదేవిధంగా ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశంలోనే ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. గతంలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు పెరిగిందన్నారు. రానున్న ఐదేండ్లలో ప్రతి ఏటా 10 వేల మంది వైద్యులు తెలంగాణ నుంచి రానున్నారని, దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందనుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదివేందుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం ఎంత భారమైనా జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతోపాటు సరిపోను ప్రొఫెసర్లను నియమించి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నదని మంత్రి వెల్లడించారు. వైద్యులను దేవుడిలా చూస్తారు కాబట్టి వైద్య విద్యను చదివి విదేశాలకు వెళ్లకుండా స్థానికంగానే పేద ప్రజలకు వైద్య సేవలందించాలని విద్యార్థులకు సూచించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంటూ సహకారం అందిస్తామని మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరిలోని 30 ఎకరాల్లో రూ.230 కోట్లతో కొత్త మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నామన్నారు. తాత్కాలిక భవన మరమ్మతులకు రూ.8 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్కుమార్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పద్మమాలిని, ఆసుపత్రి సూపరింటెండెంట్ రామచంద్రయ్య, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీ చంద్రకళ, మెడికల్ కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులున్నారు.
సమాజంలో వైద్యులకు ఇచ్చే ప్రాధాన్యత ఎవరికీ ఉండదని, విదేశాల్లో చదివినా మీ ప్రాంతాన్ని మరిచిపోవద్దని వికారాబాద్ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ విద్యార్థులకు సూచించారు. మన ప్రాంతంలో పనిచేస్తే ఆ సంతోషం వేరు అని, నాకు విదేశాల్లో వైద్యుడిగా అవకాశం వచ్చినా సొంత ప్రాంతానికి సేవ చేసేందుకే ఇక్కడే ఉన్నానన్నారు. ప్రాణాలు పోతున్న వ్యక్తి ప్రాణాలు నిలబెడితే ఆ ఆనందం మరిచిపోలేనిదన్నారు. వైద్య వైద్యలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, ర్యాగింగ్లతోపాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే మెడికల్ విద్యార్థులకు సూచించారు. వికారాబాద్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తదని కలలో కూడా అనుకోలేదని, జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావడం చాలా సంతోషమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. గతంలో ఐదు మెడికల్ కాలేజీలుండగా, ప్రస్తుతం 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్నదన్నారు. గతంలో ఏ ప్రమాదం జరిగినా హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఇక్కడే మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలతో ఏటా 10వేల మంది వైద్యులుగా రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జిల్లా ప్రజలకు వరంలాంటిదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. జిల్లాలోని దూరంగా ఉన్న మండలాల ప్రజలకు మంచి వైద్య సదుపాయం అందుతుందన్నారు. జిల్లాలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య సదుపాయాలు పెరుగనున్నాయన్నారు. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్కు ప్రతి ఆదివారం 25-30 వేల మంది పర్యాటకులు వస్తుంటారని, అలాంటి అనంతగిరి ప్రాంతంలో చదువుతుండడం మీ అదృష్టమని విద్యార్థులనుద్దేశించి అన్నారు. రానున్న రోజుల్లో జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఉత్తమ మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సహకారంతో మెడికల్ కాలేజీల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా చరిత్రలో మరిచిపోలేని రోజు అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటయిందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా ప్రజలకు వైద్య సదుపాయాలు మెరుగుకానున్నాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలు అత్యవసర వైద్య సేవలకు హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గతంలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి ప్రస్తుతం ‘నేను వస్తా సర్కారు దవాఖానకు’ అనే స్థాయికి బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య సదుపాయాలను మెరుగుపర్చిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గత పాలకుల హయాంలో కేవలం మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలుండగా, ప్రస్తుతం 26కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఏమైనా సమస్యలుంటే కుటుంబంలా చర్చించి పరిష్కరించుకోవాలని, జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీని రాష్ట్రంలోనే నంబర్ వన్ మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దాలని కాలె యాదయ్య కోరారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 85 శాతం సీట్లు తెలంగాణ వారికే దక్కడం సంతోషమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి 9 కాలేజీలను ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ ఊటీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, విద్యార్థులు వైద్య విద్యను పూర్తి చేసి పేద ప్రజలకు వైద్య సేవలను అందించాలన్నారు. జిల్లా ఏర్పాటుతోపాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.