షాద్నగర్టౌన్ : గతంలో నిరుపేదల ఇండ్లల్లో ఆడబిడ్డ పుట్టిందంటనే భారంగా భావించేవారు. ఆడబిడ్డ పెళ్లిలు చేయలంటే ఉన్నది కాస్త అమ్ముకునే పరిస్థితి ఉండేది. ఆడబిడ్డల పెళ్లి కోసం నిరుపేద తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదురుకునేవారు. తెలంగాణ సర్కార్ ఏర్పడ్డాక ప్రతి ఆడబిడ్డకు అండగా ఉండేందుకు, ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగానే ఆడబిడ్డల ఇండ్లల్లో కల్యాణకాంతులు నింపేలా సీఎం కేసీఆర్ 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి ఈ పథకంతో ఎంతో మంది నిరుపేద ఆడబిడ్డల పెండ్లీలు సంతోషంగా జరుగుతున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం తెలంగాణ సర్కార్ ఈ పథకం ద్వారా అర్హులైన వారందరికీ చెక్కులను అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరంతరం కొనసాగుతుండడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశానికే ఆదర్శంగా పథకాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నిరుపేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఆడపడుచులకు అండగా ఉండేందుకు సర్కార్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. మన రాష్ట్రంలో విజయవంతంగా అమలు అవుతున్న ఈ పథకాలను ఇతర రాష్ట్రలు సైతం అమలు చేస్తున్నాయి.
నియోజకవర్గంలో ఇలా..
ఇప్పటికే ఈ పథకం ద్వారా నియోజకవర్గంలోని ఎంతో మంది లబ్ధి పొందారు. 2017-18సంవత్సరంలో 791మందికి లబ్ధిదారులకు రూ. 7కోట్ల 91లక్షల 91వేల756, 2018-2019లో 1016మంది లబ్ధిదారులకు రూ. 10కోట్ల 17లక్షల, 17వేల, 856, 2019-2020లో 921మంది లబ్ధిదారులకు రూ. 9కోట్ల 22లక్షల 6వేల 836, అదే విధంగా 2020 నుంచి నేటి వరకు 2350మంది లబ్ధిదారులకు రూ. 23కోట్ల 52లక్షల 72 వేల 600ల చెక్కులను అందజేశారు. మొత్తం ఇప్పటి వరకు 5078మంది లబ్ధిదారులకు రూ. 50కోట్ల 83లక్షల89వేల 048లను అందించారు. ఇటివలే నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.