యాచారం, జూలై 25 : మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ఇటీవల చేపట్టిన భూసేకరణపై గ్రామానికి చెందిన రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. భూసేకరణ అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం సర్పంచ్ రమాదేవి ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుమారు రెండు గంటలపాటు నిరసన కొనసాగించారు. రైతులకు అన్యా యం చేసిన తహసీల్దార్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. కలెక్టర్, ఆర్డీవో వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. సర్పంచ్ రమాదేవి, ఉప సర్పంచ్ కుమార్, మాజీ సర్పంచ్ కృష్ణ, నాయకులు రవీందర్, అంజయ్యయాదవ్, మల్లారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో 19, 68, 127 సర్వేనంబర్లను ఇటీవలే భూసేకరణకోసం సర్వే చేశారని..127 సర్వే నంబర్లో రైతుల జాబితా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని తహసీల్దార్ అయ్యప్పకు వివరించామన్నారు.
రైతులు భూకబ్జాలో ఉన్నంతగా కాకుండా తక్కువ విస్తీర్ణంతో అధికారులు నష్టపరిహారం జాబితాను తయా రు చేయడంతో ఎంతోమంది రైతులకు అన్యాయం జరుగుతున్నదన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ధర్నా వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులు భూసేకరణలో జరిగిన అవకతవకలపై వివరించగా.. ఆయన వెం టనే ఆర్డీవో శ్రీనివాస్రెడ్డితో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యను వివరించారు. సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీవో ఫోన్లో హామీ ఇచ్చినా రైతులు ససేమిరా అంటూ ఆందోళనను కొనసాగించారు.

ఆర్డీవో రాకుంటే నాగార్జునసాగర్ రహదారిపై రాస్తారోకో చేస్తామని రైతులు హెచ్చరించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్సైలు మధు, ప్రియాంకలు తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తేల్చి చెప్పడంతో ఏసీపీ సైతం ఆర్డీవోతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి ఆర్డీవో వద్దకు వెళ్లాలని ఆయన రైతులకు నచ్చ జెప్పగా.. వారు డీసీఎంలో ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆందోళనకు దిగా రు.
అనంతరం రైతులు ఆర్డీవో శ్రీనివాస్రెడ్డితో మాట్లాడుతూ.. రైతులు దగ్గర ఉండి సర్వే చేయిం చుకున్నా నష్టపరిహారం జాబితాలో ఉన్న దాని కంటే భూమి తక్కువగా వచ్చిందని వాపోయారు. ఇలా 127 సర్వేనంబర్లో 122.0 ఎకరాలకు 108.30 ఎకరాలను మాత్రమే గుర్తించడంతో 25 మంది రైతులకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. 19, 68 సర్వేనంబర్లలో ఎలా ఉంటుందోనని భయంగా ఉందన్నారు. సర్వేయర్లు రైతుల నుంచి డబ్బులు వసూళ్లు చేసినట్టు ఆరోపించారు. వెంటనే రీసర్వే చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. భూనిర్వాసితులకు ఎకరాకు 121 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని.. లేకుంటే తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తామని హెచ్చరించారు. స్పందించిన ఆర్డీవో త్వరలో కలెక్టర్తో మీటింగ్ ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.