వికారాబాద్, సెప్టెంబర్ 17 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తక్కువ సమయంలో ప్రారంభించినట్లు మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్లోని బుగ్గరామలింగేశ్వరాలయంలో కృష్ణా జలాలతో పూజలు చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన మంత్రికి శ్రీకాంత్పంతులు పూర్ణాహుతితో స్వాగతం పలికారు. ఆలయ కోనేటిలో అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య తీసుకొచ్చిన కృష్ణా జలాలను వదిలారు. అనంతరం గర్భగుడిలో బుగ్గరామలింగేశ్వరుడికి కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. అర్చకులు సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు పూర్తిచేసి అన్ని జిల్లాలకు సాగు నీరు అందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రైతులకు పుష్కలంగా నీరు అందుతుందని తెలిపారు. ఏడాదిలో 3 పంటలు పక్కాగా సాగు చేసుకునేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరించారు. వికారాబాద్ జిల్లాలో 3 నుంచి 5 లక్షల ఎకరాలకు సాగు నీరు రాబోతున్నదన్నారు. పాలమూరు ప్రాజెక్టు నీటితో ఆలయంలో పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టుపై రైతులకు ప్రజాప్రతినిధులు వివరించి పంటల సాగుకు సహకరించాలని మంత్రి సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పాలమూరు ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం ; పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలంగా మారనున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగిలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారికి కృష్ణా నీటితో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు కేవలం హామీలు ఇవ్వడం వరకే సరిపుచ్చారని, ఒక్క ఎకరాకూ సాగునీరు అందించలేదన్నారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి చర్యలు చేపట్టారన్నారు. నార్లాపూర్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి సాగునీటిని అందించడం ద్వారా రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఉద్దండాపూర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో మొదటగా పరిగి నియోజకవర్గంలోని భూములకు సాగునీరు అందనున్నదన్నారు. కాలువల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం రెండు రోజుల క్రితమే టెండర్లు పిలిచిందని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కృష్ణా నీటితో పరిగి నియోజకవర్గం సస్యశ్యామలంగా మారనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా రంగాపూర్లో కృష్ణా నీటితో ఆంజనేయస్వామికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పరిగి, పూడూరు ఎంపీపీలు అరవిందరావు, మల్లేశం, జడ్పీటీసీ హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, వెంకటయ్య, కౌన్సిలర్లు రవీంద్ర, వెంకటేశ్, కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.