వికారాబాద్, డిసెంబర్ 8 : ఓటరు నమోదు దరఖాస్తులను బీఎల్వోల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆమోదించాలని ఎలక్టోరల్ పరిశీలకులు వాణీప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వికారాబాద్ కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, ఆర్డీవోలు అశోక్కుమార్, విజయకుమారిలతో కలిసి తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వాణి ప్రసాద్ మాట్లాడుతూ.. బీఎల్వోలు అవసరమైన రిజిస్టర్ను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. మరణించినవారి సంబంధీకులకు ముందుగా నోటీసు ఇచ్చి డెత్ సర్టిఫికెట్ తీసుకున్న తరువాత తొలగించాలన్నారు. మైగ్రేటేడ్ ఓటర్లను పరిశీలించాలని, ఒక వ్యక్తికి రెండు ఎపిక్ కార్డులు ఉన్నైట్లెతే తొలగించాలని సూచించారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాలని వివరించారు.
బీఎల్వోలు, పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో ఈఆర్వోలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ, పారదర్శకంగా ఓటర్ల తుది జాబితాను రూపొందించాలని పేర్కొన్నారు. జిల్లాలో ఓటరు కార్డులకు ఇప్పటివరకు 60 శాతం మాత్రమే ఆధార్ కార్డు అనుసంధానం జరిగిందని.. పొలిటికల్ పార్టీల సహకారంతో 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 1,130 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇద్దరు ఈఆర్వోలు, 22 మంది ఏఈఆర్వోలు ఉన్నారని తెలిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలని వాణీప్రసాద్ పేర్కొన్నారు. పారదర్శకంగా ఓటర్ల తుది జాబితా తయారు చేసేందుకు వీరిని భాగస్వాములను చేయాలని సూచించారు. పార్టీల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని అవసరమైన వివరాలు అందిస్తుండాలని కోరారు. అనంతరం వికారాబాద్ నియోజకవర్గంలోని సంఘం లక్ష్మీబాయి పాఠశాలలో, మన్నెగూడలో ఓటర్ నమోదు కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బీఎల్వోలు నిర్వహిస్తున్న రిజిస్టర్లను,కొత్తగా ఓటరు నమోదుకు చేసుకున్న దరఖాస్తులను, డుప్లికేట్ ఓట్లను, చనిపోయిన వారి తొలగింపు వివరాలను పరిశీలించారు.