పరిగి : రైల్వే శాఖ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యను కోరారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలతో మంగళవారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో రైల్వే జనరల్ మేనేజర్ గజానన్మాల్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్పేట్ మండలంలోని గటవనంపల్లి, మొరంగపల్లిలో ఆర్యూబీలు నిర్మించాలని కోరారు.
వికారాబాద్ పట్టణంలోని ప్రధాన రైల్వే బ్రిడ్జిని మరింత పటిష్టం చేయడంతో పాటు స్టేషన్లో మరో ఫుట్పాత్ను ఏర్పాటు చేయాలన్నారు. పాత తాండూరు, కొత్త తాండూరు మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్లు, తాండూరు రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. నారాయణపూర్ రైల్వే క్రాసింగ్ వద్ద బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, తాండూరు రైల్వే స్టేషన్ను అందంగా తీర్చిదిద్ది ఫౌంటేన్ను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వీటితో పాటు వికారాబాద్ జిల్లా పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో కోణార్క్, పద్మావతి, గరిబ్రథ్, పల్నాడ్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రజల సౌకర్యం కోసం ఆపాల్సిందిగా ఎంపీ కోరారు. అలాగే ఇతర సమస్యలను సైతం జీఎం దృష్టికి తీసుకువెళ్లారు.