ధారూరు, జూలై 3: పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్ర వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. శనివారం మండల పరిధిలోని దోర్నాల్, ధారూరు స్టేషన్ గ్రామాల్లో ఆమె పర్యటించి పల్లెప్రగతి, హరితహారం పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నర్సరీ, డంపింగ్యార్డు, దోబీఘాట్లను పరిశీలించారు. ఇండ్లపై వేలాడే కరెంటు వైర్లను సరిచేయాలన్నారు. ఒరిగిన, తుప్పుపట్టిన కరెంటు స్తంభాలను తొలగించాలని, విద్యుత్ అధికారులను ఆదేశించారు.
మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. రోడ్లపై చెత్తను వేయకూడదని ప్రజలకు సూచించారు. ఇంటింటికీ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలించాలన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేయాలని సర్పంచ్ సుజాతకు సూచించారు. రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో షఫీవుల్లా, ఏపీవో సురేశ్కుమార్, సర్పంచ్ సుజాత, డిప్యూటీ తాసిల్దార్ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి కిషన్, నాయకులు వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.