షాబాద్, జనవరి 25: జల్పల్లి మున్సిపాలిటీలో జల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా మెట్రో వాటర్ 2 దశలో భాగంగా రూ. 60 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ పనులకు ఈ నెల 29న మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జల్పల్లి మున్సిపాలిటీలో వివిధ పనులకు సంబంధించి రూ. 20 కోట్లు మంజూరు అయ్యాయని, టెండర్ ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. సెంట్రల్ లైటింగ్కు మరో రూ. 50 లక్షలు మంజూరయ్యాయన్నారు. 6 నెలల్లో పనులు పూర్తయితే మున్సిపాలిటీకి ఒక నూతన హంగు వస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ కృషితో పహాడీషరీఫ్ రోడ్డుకు రూ. 3 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 25 కోట్ల 3 లక్షల నిధులు మంజూరయ్యాయని మంత్రి పి. సబితారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు సౌకర్యాల కల్పనలో భాగంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావులకు మంత్రి సబితారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.