జూన్ 14, (నమస్తే తెలంగాణ) : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకుగాను వివిధ పథకాల్లో భాగంగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండ్లులేని నిరుపేదలపై భారం మోపకుండా ఉచితంగా సొంతింటి కలను నెరవేర్చే బృహత్తర పథకం డబుల్ బెడ్రూం పథకమని, అయితే ఇండ్ల నిర్మాణం సకాలంలో పూర్తయినా.. లబ్ధిదారులకు అప్పగించడంలో జాప్యం జరిగితే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుందన్నారు. రాజేంద్రనగర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయినా లబ్ధిదారులకు అప్పగించకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతాచోట్ల నిర్ణీత సమయంలోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇండ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు ముందుకురాని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అమలుచేయాలని, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలను అందించాలని సూచించారు. జిల్లాలో రాజీవ్ గృహకల్ప, జేఎన్ఎన్యూఆర్ఎం పథకాల్లో భాగంగా నిర్మించిన ఇండ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అప్పగించకపోవడంపై సంబంధిత అధికారులపై మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ లబ్ధిదారులకు ఇండ్లు అందజేయాల్సి ఉందో వివరాలను వారం రోజుల్లో అందజేయాలని, భర్తీ కాకుండా మిగిలిపోయిన ఇండ్ల వివరాలను ఎమ్మెల్యేలు అందజేస్తే, వాటిని నిజమైన పేదలకు అప్పగిద్దామన్నారు. అంతేకాకుండా ఇప్పటికే నిర్మించిన ఇండ్లలో లబ్ధిదారులు నివసిస్తున్నారా, ఇతరులు ఎవరైనా ఉన్నారనేది వారం రోజుల్లో సర్వే చేసి వివరాలను అందజేయాలన్నారు. అదేవిధంగా కొత్తగా నిర్మిస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలైన రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, కలెక్టర్ అమయ్కుమార్ పాల్గొన్నారు.