తాండూరు, డిసెంబర్ 19 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. సోమవారం తాండూరులోని నం.1 ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. కిచెన్ షెడ్తోపాటు పలు పనులు పెండింగ్లో ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతతో కాంట్రాక్టర్లు ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. అందుకు సంబంధిత అధికారులు పరిశీలిస్తూ పనుల్లో ఆలస్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్నగర్లోని పార్కుతో పాటు ఆదర్శనగర్లోని క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. పాత తాండూరు బస్తీ దవాఖానను పరిశీలించి అక్కడ అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. తాండూరులో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వార్డుకో పార్కు, నర్సరీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా క్రమశిక్షణతో ఉంటూ తమ బాధ్యతలను విధిగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.
మన్సాన్పల్లి, మంబాపూర్లో తనిఖీలు
పెద్దేముల్ : వన నర్సరీల్లో మొక్కల పెంపకంలో భాగంగా బ్యాగ్ ఫిల్లింగ్ అయిన వెంటనే బ్యాగుల్లో విత్తనాలను నాటాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని మన్సాన్పల్లి, మంబాపూర్ గ్రామాల్లో పర్యటించి వన నర్సరీలు, కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్సాన్పల్లి నుంచి మంబాపూర్ వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడానికి అనువైన స్థలం ఉన్నందున ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా విరివిగా మొక్కలు నాటాలన్నారు. అంతకుముందు నాటి పాడైన మొక్కలను మార్చి వాటి స్థలాల్లో నూతన మొక్కలను నాటాలని, ప్రైమరీ బెడ్లు, వర్క్ సైట్ నేమ్ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని, కంపోస్టు షెడ్డులను వీలైనంత త్వరగా అన్ని గ్రామాల్లో వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
మన్సాన్పల్లిలో క్రీడా ప్రాంగణానికి భూ కేటాయింపుపై ఆరా తీశారు. మంబాపూర్ వన నర్సరీలో 5 వేల మొక్కలకు బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తయింది కాబట్టి.. అందులో విత్తనాలను నాటి మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అంతకు ముందు ఎంపీవో షేక్ సుష్మాను పంచాయతీ కార్యదర్శులు మానిటరింగ్పై ప్రశ్నించారు. ప్రతి రోజూ వారి నుంచి గ్రామాలవారీగా డీఎస్ఆర్ రిపోర్ట్, ఫొటోస్ తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో ఎంపీడీవో, తాను పర్యవేక్షిస్తున్నామని బదులిచ్చారు. కార్యక్రమంలో మన్సాన్పల్లి సర్పంచ్ రుక్కీబాయి, ఎంపీడీవో లక్ష్మప్ప, ఏపీవో లక్ష్మీదేవి, ఈసీ కృష్ణ, టీఏలు విజయ్, ప్రవీణ్, జంగయ్య, పంచాయతీ కార్యదర్శులు జమీల్, నరేశ్ ఉన్నారు.