హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లను కేంద్ర రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రెండు రైళ్లు చర్లపల్లి-గోరఖ్పూర్, ధన్బాద్-కోయంబత్తూర్ మధ్య ప్రయాణించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్ల వల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఏపీ మధ్య రైలు అనుసంధానం బలోపేతం అవుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అతి త్వరలో వీటి టైమ్ షెడ్యూల్ను ప్రకటించే అవకాశమున్నదని అధికారులు తెలిపారు.