పరిగి, నవంబర్ 27 : సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు తరగతికి తగ్గ స్థాయిలో చక్కటి విద్యాభ్యాసం పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. కరోనా సంక్షోభ సమయం నుంచి విద్యార్థులు విద్యలో కొంత వెనుకబడ్డారన్నది వాస్తవం. ప్రతి విద్యార్థి ఆయా తరగతికి తగ్గ స్థాయిలో విద్య అభ్యసించి మరింత ఉత్తమ విద్యార్థులుగా తయారు చేయాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం ‘తొలిమెట్టు’ను అమలు చేస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో 767 ప్రాథమిక పాఠశాలలు, 116 ప్రాథమికోన్నత పాఠశాలలుండగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు 47,896 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారికి ప్రతినెలా నిర్వహిస్తున్న పరీక్షల ఆధారంగా జిల్లా పరిధిలో మెరుగైన ప్రగతి సాధిస్తున్నారని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
తరగతి తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దడం లక్ష్యం
1 నుంచి 5వ తరగతి వరకు అమలు చేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమంతో ఆయా తరగతికి తగ్గట్టుగా విద్యార్థులను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దడం లక్ష్యంగా కొనసాగుతున్నది. విద్యార్థులు చక్కగా రాయడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం, అలాగే చతుర్విద ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం చక్కగా చేసేలా వారిని తీర్చిదిద్దడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకం ఆధారంగానే బోధిస్తున్నారు. ప్రతి రోజూ ఏ అంశం బోధిస్తున్నారో అందుకు సంబంధించిన ప్రణాళిక తయారు చేసి, అలాగే బోధనోపకరణాలు ఉపయోగించి విద్యాబోధన కొనసాగిస్తున్నారు. విద్యార్థి నేర్చుకున్న అంశాల్లో సూక్ష్మ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు. ప్రతినెలా విద్యార్థుల సూక్ష్మ సామర్థ్యం పరిశీలనకు పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆయా తరగతుల ఆధారంగా ఒక నిమిషంలో ఎన్ని పదాలు ధారాళంగా చదువుతున్నారు, వాటిని ఎంత వరకు అర్థం చేసుకున్నారు, ఎలాంటి తప్పులు లేకుండా రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడం ఆధారంగా మార్కులు ఇవ్వనున్నారు. పరీక్షల అనంతరం సంబంధిత నెలలో 28వ తేదీ వరకు సంబంధిత సబ్జెక్ట్ టీచర్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో విద్యార్థుల సామర్థ్యాల పరిశీలన నివేదికను అప్లోడ్ చేస్తున్నారు. ప్రతి నెలా ఈ విధంగానే అప్లోడ్ చేయడం ద్వారా సంబంధిత నెలలో ఎంతమంది చక్కగా రాయడం, చదవడం, చతుర్విద ప్రక్రియలు చేస్తున్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేక నియామకాలు
తొలిమెట్టు కార్యక్రమం అమలు ద్వారా విద్యార్థుల సూక్ష్మ సామర్థ్యాల పరిశీలన కోసం ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ నియామకం చేపట్టారు. అలాగే కాంప్లెక్స్ స్థాయిలో నలుగురు సబ్జెక్ట్ టీచర్లను నియమించారు. వారితోపాటు మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, జిల్లా స్థాయి నుంచి జిల్లా విద్యాధికారులు, విద్యా శాఖకు సంబంధించిన అధికారులు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తున్నారు. ట్యాంగరిన్ యాప్లో ఉండే ప్రశ్నలను వినిపించి వాటిని చదివిస్తున్నారు. అలాగే విద్యార్థులతో కొన్ని పదాలు రాయించడం ద్వారా వారిని పరిశీలిస్తారు. పర్యవేక్షణతో మరింత ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని చెప్పవచ్చు. ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన పూడూరు మండలంలోని కండ్లపల్లి పాఠశాలను సందర్శించి తొలిమెట్టు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వికారాబాద్ కలెక్టర్ నిఖిల దోమ మండలంలోని శివారెడ్డిపల్లి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మండలాల్లో ఎంఈవోలు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరింత చక్కగా అమలు జరిగేలా చూస్తున్నారు.
జిల్లాలో చక్కటి ఫలితాలు
‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు తర్వాత వికారాబాద్ జిల్లా పరిధిలోని సర్కారు బడుల్లో చదువుతున్న చిన్నారులు విద్యాభ్యాసంలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత నెలవారీగా నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఆగస్టు నెలలో నిర్వహించిన పరీక్షలకు 45,916 మంది హాజరయ్యారు. ఇందులో తెలుగుకు సంబంధించి చదవడం 16.18శాతం, ధారాళంగా చదవడంతోపాటు అర్థం చేసుకోవడం 7.56శాతం, రాయడం 5.31శాతం, ఆంగ్లంలో చదవడం 15.30శాతం, ధారాళంగా చదవడంతోపాటు అర్థం చేసుకోవడం 5.25శాతం, తప్పులు లేకుండా రాయడం 5.06శాతం, గణితంలో కూడికలు 25.50శాతం, తీసివేతలు 13.91శాతం, గుణకారం 5.70శాతం, భాగహారం 1.67శాతం మంది చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సెప్టెంబర్లో తెలుగును చదవడం 21.04శాతం, ధారాళంగా చదవడంతోపాటు అర్థం చేసుకోవడం 9.94శాతం, తప్పులు లేకుండా రాయడం 6.95శాతం, ఆంగ్లము చదవడం 19.39శాతం, ధారాళంగా చదవడంతోపాటు అర్థం చేసుకోవడం 6.98శాతం, రాయడం 6.88శాతం వరకు పెరిగింది. అలాగే గణితంలో కూడికలు 32.35శాతం, తీసివేతలు 19.15శాతం, గుణకారం 8.18శాతం, భాగహారం 2.41శాతం చేయగలుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్ నెలలో తెలుగుకు సంబంధించి చదవడం 21.76శాతం, ధారాళంగా చదవడంతోపాటు అర్థం చేసుకోవడం 11.44శాతం, తప్పులు లేకుండా రాయడం 7.57శాతం, ఆంగ్లానికి సంబంధించి చదవడం 20.12శాతం, ధారాళంగా చదవడంతోపాటు అర్థం చేసుకోవడం 8.39శాతం, రాయడం 7.50శాతం మంది విద్యార్థులు చేస్తున్నారు. అలాగే గణితంలో కూడికలు 33.44శాతం, తీసివేతలు 20.89శాతం, గుణకారం 9.52శాతం, భాగహారం 3.18శాతం మంది విద్యార్థులు చేయగలిగారు. తద్వారా ప్రతినెల విద్యార్థులు మరింత ప్రగతి సాధిస్తున్నారు.