చేవెళ్ల రూరల్, నవంబర్ 24 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ప్రభుత్వ బడులకు వెళ్లాలంటే బోధన సరిగ్గా ఉండదని, వసతుల లేమి, నిధులు అంతంత మాత్రం, ఉపాధ్యాయులు సమయానికి రారు అనే భావన ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ వహించి మన ఊరు -మన బడి అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.
పాఠశాల విద్యలో మరింత ప్రగతి సాధనకు..
ప్రభుత్వం పాఠశాల విద్యలో మరింత ప్రగతిని సాధించేందుకు మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు – మన బడిగా, పట్టణ ప్రాంతాల్లో మన బస్తీ – మన బడిగా పిలువబడుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నది.
చేవెళ్ల మండలంలో 24 పాఠశాలలు ఎంపిక
చేవెళ్ల మండల పరిధిలో 24 ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసి రూ.4 కోట్ల 6లక్షల పైచిలుకు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ వర్క్, హ్యాండ్ వాష్లు, ప్రహరీల నిర్మాణం, నూతన తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, నిరంతర నీటి సరఫరాకు నల్లాల ఏర్పాటు తదితర మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి.
పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు పాఠశాలలు..
చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి, గుండాల ప్రభుత్వ పాఠశాలలను పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ఎంపిక చేసి ప్రత్యేకంగా పెయింటింగ్ వేయించి పనులు పూర్తి చేసింది.
పూర్తి స్థాయిలో సౌకర్యాలు..
మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. అన్ని సౌకర్యాలు కల్పిస్తుండంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. గతంలో కంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వాతారణం కనిపిస్తున్నది. సౌకర్యాలు చూసి ప్రైవేట్ను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరుతుండడం సంతోషాన్నిస్తున్నది.
– మల్లేశ్, ప్రధానోపాధ్యాయుడు, అంతారం జడ్పీ హెచ్ఎస్
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు..
ప్రభుత్వం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు గతంలో సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతుండేవి. ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో మన ఊరు – మన బడి అనే గొప్ప కార్యక్రమం చేపట్టడం శుభపరిణామం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అధిక నిధులు మంజూరు చేస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞలు.
– నరేంద్ర బోగం,
కందవాడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, చేవెళ్ల మండలం
చురుగ్గా పనులు జరుగుతున్నాయి..
మన ఊరు – మన బడిలో చేవెళ్ల మండలంలో 24 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో విద్యుద్దీకరణ, హ్యాండ్ వాష్, వంట గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. పనులు సక్రమంగా జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు శాయశక్తులా శ్రమిస్తున్నాం.
– హనీషా, ఏఈపీఆర్ (పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజినీర్)
పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులు..
మన ఊరు- మన బడిలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులు సమకూర్చి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం హాజరు శాతం పెరిగింది. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే వారు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
– సయ్యద్ అక్బర్, చేవెళ్ల మండల విద్యాధికారి
‘మన ఊరు- మన బడి’ 12 ప్రధానాంశాలు..
1.) నిరంతర నీటి సరఫరాతో మరుగు దొడ్లు
2.) విద్యుద్దీకరణ
3.) తాగు నీరు
4.) ఫర్నిచర్
5.) పెయింటింగ్
6.) పెద్దతరహ, చిన్న తరహ మరమ్మతులు
7.) ఆకు పచ్చ రాత బోర్డులు
8.) ప్రహరీ
9.) వంట గది
10.) శిథిల భవనాల స్థలంలో నూతన గదులు
11.) భోజన శాల (ఉన్నత తరగతుల్లో)
12.) డిజిటల్ సౌకర్యాలు