వికారాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తయ్యాయి. విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ సామగ్రిని పంపిణీ చేయడం మొదలుకుని అన్ని కార్యక్రమాలు రైతు వేదిక కేంద్రంగా సాగనున్నాయి. రైతులకు సాగు సలహాలు,సూచనలు అందించడంతో పాటు శిక్షణ కోసం ఇక్కడ సమావేశాలు నిర్వహించేందుకు ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో అన్ని టెక్నాలజీ హంగులతో కూడిన రైతు వేదిక భవనాలు నిర్మించారు. వీటిల్లోనే భూసార పరీక్షలు కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఇవి అందుబాటులోకి రాగా..మరికొన్నిచోట్ల త్వరలో అందు బాటులోకి రానున్నాయి. దీంతో అన్నదాతలకు అనేక రకాల ప్రయోజనాలు కలుగనున్నాయి. జిల్లాలో 2లక్షల మందికి పైగా రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. ప్రస్తుత సీజన్లో 1.50లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. భూసార పరీక్షలపై అవగాహన లేకపోవడంతో రైతులు అవసరం ఉన్నా.. లేకున్నా..ఇష్టమొచ్చినట్లుగా రసాయన మందులు వాడుతున్నారు.దీంతో పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా, భూములు సారాన్ని కోల్పోతున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఈ సారి పరీక్షలు ముమ్మరం
జిల్లాలో 51 మినీ ల్యాబ్లున్నాయి. మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించి చైతన్యం పెంచేందుకు క్లస్టర్ల వారీగా మినీ భూసార కేంద్రా(ల్యాబ్)లను ఏర్పాటు చేసింది. అన్ని క్లస్టర్లకు అవసరమైన సామగ్రి వ్యవసాయ కార్యాలయంలోనే ఏర్పాటు చేసుకోవడంతో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ఓకే చోట పరీక్షలు నిర్వహించాల్సి వచ్చేది. కొన్నిచోట్ల స్థలాలు లేక పంచాయతీ భవనాలు,అద్దె భవనాల్లో ఏర్పాటు చేయడంతో వసతులు లేక ఆశించిన ఫలితాలు వచ్చేవి కావు. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెలో క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించింది. గతేడాది డివిజన్కు ఐదు గ్రామాల చొప్పున ఎంపిక చేసుకొని 5900 మందికి సంబంధించి రైతుల భూసార పరీక్షలను నిర్వహించారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఈ పరీక్షలను ముమ్మరం చేయనున్నారు.
97 రైతు వేదికలివే..
జిల్లాలో 97 రైతు వేదికల నిర్మాణం పూర్తైంది.వికారాబాద్లో 4,ధారూర్లో 7,మోమిన్పేట్లో 5,మర్పల్లిలో 5,బంట్వారంలో 2,కోట్పల్లిలో 3,నవాబ్పేట్లో 5,తాండూర్లో 7,పెద్దేముల్లో 6,బషీరాబాద్లో 6,యాలాల్లో 5,పరిగిలో 6, పూడూర్లో 5, దోమలో 5,కుల్కచర్లలో 4,కొడంగల్లో 8,దౌల్తాబాద్లో 8, బొంరాస్పేట్లో 6 చొప్పున ఉన్నాయి. వీటి నిర్మాణానికి సంబంధించి రూ.2కోట్ల 13లక్షలకు పైగా ఖర్చు చేశారు.
రైతులకు ఉపయోగకరం: గోపాల్,జిల్లా వ్యవసాయాధికారి
క్లస్టర్ వారీగా రైతులు భూసార పరీక్షల ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉన్నది. రైతు వేదికల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గతంలో మంజూరైన 51 మినీ ల్యాబ్లను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు వేదికల్లోకి మార్చనున్నాం. ఈ పరీక్షల వలన రైతులను అనేక ఉపయోగాలున్నాయి.