Vikarabad | వికారాబాద్, జూలై 5 : విహార యాత్రకు వచ్చి బోట్ బోల్తా పడ్డ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్పల్లి ప్రాజెక్టు సమీపంలో వెల్డర్న్నెస్ అనే ఒక రిసార్ట్ ఉంది. బీహార్ రాష్ట్రానికి చెందిన కొంత మంది పర్యాటకులు హైదరాబాద్కు చెందిన మరి కొంత మంది పర్యాటకులతో దాదాపు 10 మంది కలిసి శనివారం వికారాబాద్లోని వెల్డర్నెస్ రీసార్ట్కు వచ్చారు. రిసార్ట్ వెనుకాల సర్పన్పల్లి చెరువు ఉండడంతో అందులో అనుమతులు లేకుండా నిర్వాహకులు బోటింగ్ నిర్వహించారు. నిర్వాహకుల సహాయంతో పర్యాటకులు బోటింగ్ చేస్తున్నారు. ఒక బోటింగ్లో రీటా కుమారి (55), పూనం సింగ్(56) ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆ బోట్ కాసేపటికే ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయింది. గమనించిన స్థానికులు చిన్నారులను కాపాడారు. మహిళలను కాపాడే ప్రయత్నం చేశారు. నీటిలో మునిగిపోరవడంతో అపస్మారక స్థితిలో చేరుకున్నారు. వెంటనే చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించినా ఫలితం లేకుండాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ దవాఖానకు తరలించారు.