వికారాబాద్ : నిరుపేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూరు మండలం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పేద, బడుగు బలహీన వర్గాల ప్రజా ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నిధులను మంజూరు చేస్తుందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చుల కోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.