నవాబుపేట, డిసెంబర్ 30 : చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండల కేంద్రంతోపాటు ఎక్మామిడి, పుల్మామిడి, లింగంపల్లి, యెల్లకొండ, మైతాబ్ఖాన్గూడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పలు రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. నవాబుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ ల్యాబ్, ఎంఆర్సీ భవనాలను మంత్రులు ప్రారంభించారు. ఒక్కరోజే 30 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో పల్లెల రూపురేఖలు మారాయని.. పల్లెప్రగతి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 3 గంటలు కూడా సక్రమంగా సరఫరా కాని విద్యుత్.. నేడు తెలంగాణలో 24 గంటలు వస్తుందంటే అది సీఎం కేసీఆర్ ఘనతే. 40 వేల కోట్ల ఖర్చుతో ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి సాగునీటి కోసం కృషిచేస్తామన్నారు. ఎలాంటి పైరవీ లేకుండా రైతులకు ఎకరాకు 10వేలు ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఇప్పటివరకు రూ.50వేల కోట్లను అందజేసినట్లు చెప్పారు. వరి ధాన్యం కొనాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాడితే.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఏమి చేశారని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందుతున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక లక్షా30వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన కేంద్రం ఏమి చేస్తున్నదని మండిపడ్డారు. బండి సంజయ్ దొంగ నిరుద్యోగ దీక్షతో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో అభివృద్ధి జరిగేందుకు నిధుల మంజూరుకు పోటీపడాలని మంత్రులు సూచించారు.కార్యక్రమంలో ఎంపీపీ కాలె భవాని, జడ్పీటీసీ జయమ్మ, టీఆర్ఎస్ నవాబుపేట మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎక్మామిడి సర్పంచ్ రఫీ, నవాబుపేట సర్పంచ్, పుల్మామిడి సర్పంచ్ విమల, లింగంపల్లి సర్పంచ్, యెల్లకొండ సర్పంచ్ వెంకట్ రెడ్డి, మైతాబ్ఖాన్గూడ సర్పంచ్ అనిత, టీఆర్ఎస్ కార్యకర్తలున్నారు.