మహేశ్వరం : తెలంగాణలో సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వమే శ్రీరామ రక్ష అని మహేశ్వరం నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita reddy) అన్నారు. మంగళవారం మహేశ్వరం గ్రామం కేబీ తండాకు చెందిన 40 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మినాజ్ పటేల్, కరోళ్ల చంద్రయ్య ఆధ్వర్యంలో, పెండ్యాల గ్రామానికి చెందిన 50 మంది ముస్లిం మహిళలు, గ్రామ సర్పంచ్ మంత్రి సంధ్యారాజేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటమి తప్పదని, ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన నియోజక వర్గంలో ఎగిరేది గులాబీ జెండానే నని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని వివరించారు. ఈ ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ అఖండ విజయం సాధించబోతుందని అన్నారు.
గడిచిన ఐదేండ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉన్నందునే ప్రజలను ఓట్లు (Votes) అడిగే హక్కు తమకే ఉందని అన్నారు. ఎన్నడూ కానరాని నాయకులు ఓట్ల పండుగలు రాగానే ఇండ్ల ముందు దర్శనమిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూన యాదయ్య, అంబయ్య యాదవ్, ఆనందం, కాకి కుమార్, మనోహర్, దుడ్డు క్రిష్ణయాదవ్, అశోక్, మోతిలాల్ నాయక్, బాలునాయక్, రాజు, ఎస్కే ఆజాం, రాజు తదితరులు పాల్గొన్నారు.