రంగారెడ్డి, ఏప్రిల్ 15, (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు చెందిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాసంగి ధాన్యాన్ని తెలంగాణ రైతుల నుంచి సేకరించబోమని కేంద్రం స్పష్టం చేయడంతో.. రైతులు ఆగం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ యా సంగి సీజన్ వడ్లను కూడా కొనేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలకు అనుగుణంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం గ్రామా ల్లో ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి రూ.1960 మద్దతు ధరను పొందాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో గతేడాదితో పోల్చితే వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. ఇందుకు ప్రభుత్వం చేసిన విస్తృత ప్రచారం సత్ఫలితాలను ఇచ్చింది. అదేవిధంగా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెం డు, మూడు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 47,231 ఎకరాల్లో వరి సాగు చేయగా, 1.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా అవసరాలకుపోను 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.
జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, వడ్లను సేకరించాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే జిల్లాలో వరి కోతలు ఆలస్యంగా జరుగనున్న దృష్ట్యా ఆ సమయంలోగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం మంచాల మండలంలో మాత్రమే వరి కోతలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులో గా అన్ని మండలాల నుంచి ధాన్యం వచ్చే అవకాశం ఉంటుందని, ఆ సమయంలోగా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాకు 17లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ప్రస్తుతం జిల్లాలో 8 లక్షల బ్యాగు లు అందుబాటులో ఉన్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మిగతా గన్నీ బ్యాగులను కూడా వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా గన్నీ బ్యాగులను తిరిగి ఇవ్వని రైస్ మిల్లర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో 41 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించా రు. డీసీఎంఎస్, పీఏసీఎస్, ఐకేపీ, మార్కెట్ కమిటీలు, ఎఫ్ఎస్సీఎస్ ఆధ్వర్యంలో ధాన్యాన్ని సేకరించనున్నారు. గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన దృష్ట్యా జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో వరి సాగయ్యిందనే వివరాలను సేకరించిన అధికారులు, ఏ ఒక్క రైతుకూ ఇబ్బం ది కలుగకుండా రెండు, మూడు గ్రామాలను కలిపి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఆమనగల్లు, కడ్తాల్, చుక్కాపూర్, పడ్కల్, గట్టుఇప్పాయిపల్లి, రాంపూర్, నందిగామ, మేకగూడ, కొత్తపేట, తొమ్మిదిరేకుల, చేగూర్, షాద్నగర్, కొం దుర్గు, చౌదరిగూడెం, మోకిల, మహేశ్వరం, కం దుకూరు, మల్కారం, పొల్కంపల్లి, మంచాల, లోయపల్లి, అరుట్ల, బోడకొం డ, తలకొండపల్లి, యాచారం, బాచారం, రాయిపోల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డీసీఎంఎస్ల ఆధ్వర్యంలో అర్కపల్లి, నాగిళ్ల, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కొహెడ గ్రామా ల్లో.. ఐకేపీ ఆధ్వర్యంలో సర్దార్నగర్, చింతపట్ల గ్రామాల్లో.. ఎఫ్ఎస్సీఎస్ ఆధ్వర్యంలో పాలమాకుల, పటేల్గూడగ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పరిగి, ఏప్రిల్ 15: యాసంగి సీజన్కు సంబం ధించిన వడ్లను కొనేందుకు వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల నుం చి ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లా పరిధిలో 167 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. ఈ యాసంగిలో 29,200 మంది రైతులు సుమారు 45,690 ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. ఇందులో 12వేలకు పైగా ఎకరాల్లో సన్న రకాలు, 33వేలకు పైగా ఎకరాల్లో దొడ్డు రకాలు ఉన్నాయి. సన్న రకాలతో 15వేల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకాలతో లక్షా3వేల మెట్రిక్ టన్నులు, మొత్తం లక్షా18వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు వడ్లను తక్కువ ధరకు దళారులకు విక్రయించొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల్లోనే రూ. 1960కు అమ్ముకోవాలని సూచిస్తున్నారు.
ఈ సీజన్లో రైతుల నుంచి వడ్లను సేకరించేందుకు జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించా రు. ఇందులో భాగంగా ఐకేపీ ద్వారా 78 కొనుగోలు కేంద్రాలు, పీఏసీఎస్ల ద్వారా 41, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 44, వ్యవసాయ మార్కె ట్ కమిటీల ద్వారా నాలుగు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో కంటే ఈసారి అధికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి జిల్లాలో ప్రస్తుతం టార్పాలిన్లు 1620 అవస రం కాగా 1506 అందుబాటులో ఉన్నాయి. ప్యాడీ క్లీనర్లు 180 అవసరం కాగా 65 అందుబాటులో ఉన్నాయి. అలాగే 3,76,412 గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే కొన్న వడ్లను ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లనూ చేస్తున్నారు.
జిల్లా పరిధిలో వరి ధాన్యం కోతలు ఏప్రిల్ చివరి వారంలో ఆరంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల కొనుగోలు కేంద్రాలను ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాతో పోలిస్తే ఇక్కడ పంటల సాగు, కోతలు ఆలస్యంగా ఉంటాయి. ఈ నేపథ్యం లో జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. కోతలు ప్రారంభమైన వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తే ఇబ్బంది ఉండదని, అప్పటివరకు అవసరమైన గన్నీ బ్యాగులను సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వడ్ల కొనుగోలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలను కూడా జారీ చేశారు.ఏఏ ప్రాంతా ల్లో అధికంగా వరి సాగు చేపట్టారో పరిశీలించి, అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ధాన్యం డబ్బులను కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో సాధ్యమైనంత త్వరగా జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలోని రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలి. ఈ నెల 20వ తేదీ నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. జిల్లాకు అవసరమయ్యే గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-అమయ్కుమార్, రంగారెడ్డి కలెక్టర్
ధాన్యం కొనుగోలు ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు