కోట్పల్లి, జూన్ 01 : గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడొద్దనే ‘మీతో నేను’ కార్యక్రమాన్ని చేపట్టామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం బంట్వారం మండలం మద్వాపూర్ గ్రామంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామ ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులతో ముచ్చటించారు. తాగునీటి ట్యాంక్లను కడగడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తేగా తాగునీటి ట్యాంక్ను నెలలో మూడు సార్లు ఖచ్చితంగా శుభ్రం చేయాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
అలాగే మద్వాపూర్ వ్యవసాయ క్లస్టర్ ప్రస్తుతం తోర్మామిడిలో కొనసాగుతుతున్నది. దీంతో ఇబ్బంది అవుతుందని, బంట్వారం క్లస్టర్లోకి మార్చితే అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తోర్మామిడి నుంచి బంట్వారంకు మార్చాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఏఎన్ఎం, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరిగా పని చేయడం లేదని ఎమ్మెల్యే దృష్టికి రాగా పని సరిగా చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.