జమ్ముకశ్మీర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న పౌర తిరుగుబాటు 27వ రోజుకు చేరుకున్నది. తీవ్రమవుతున్న ప్రభుత్వ అణచివేత, సాయుధ పారామిలిటరీ చర్యలు, కాల్పుల వ్యూహాలను ధిక్కరిస్తూ, పాకిస్థాన్ పాలన నుంచి విముక్తి కోరుతూ నిరసనకారులు ఆందోళన తీవ్రం చేస్తున్నారు. అదే సమయంలో మానవతా సహాయం, ఆహార సరఫరా కోసం భారతదేశంతో పునరేకీకరణ వైపు మొగ్గు చూపుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు.
ఈ భారీ ప్రదర్శనల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కోట్లి ప్రాంతంలో పాకిస్థాన్ ఆక్రమణను పూర్తిగా తిరస్కరిస్తూ వేలాది మంది ప్రజలు ఒకచోట చేరి నినాదాలు చేశారు. “స్వాతంత్య్రం మా హక్కు, మేము మా స్వాతంత్య్రాన్ని సాధించుకుంటాం” అని భారీ జనసందోహం నినదించడం కనిపించింది. పాక్ ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా స్థానిక బృందాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. రావల్కోట్, హట్టియన్ బాలాలో పాలకులు, భద్రతా సంస్థలను నేరుగా హెచ్చరిస్తూ వీధులు మార్మోగాయి.
ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేయడానికి పాక్ ప్రయత్నిస్తున్నది. ముజఫరాబాద్లోని వ్యూహాత్మక నీలం బ్రిడ్జ్ వద్ద, దాద్యాలో పాకిస్థానీ రేంజర్స్ నిరసనకారులపై కాల్పులు జరిగాయి. ఇందులో కనీసం 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల తర్వాత సైతం నిరసనకారులు భారీ మోటర్ సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తూ, సాయుధ పోలీసు విభాగాలను ఎదుర్కొంటూ వీధుల్లో తమ పట్టును కొనసాగిస్తున్నారు.