వికారాబాద్ : కాలనీల్లో పేరుకపోయిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 13, 14, 22, 23వ వార్డుల్లో ‘మీతో నేను’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీల్లో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీరు రోడ్లపై నిలువకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల్లో పాడుబడ్డ ఇండ్లు కూల్చి, ప్రమాదకరంగా ఉన్న బావులపై జాలి ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇంటికి సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించేలా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు.
తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని ప్రజలకు సూచించారు. పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. నీటి ట్యాంకులను నిరంతరం శుభ్రం చేయాలని, మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఉన్న సమయంలోనే నీటి ట్యాంకులను వినియోగించుకోవాలన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి
మండలాల్లోని ప్రతి గ్రామం, మున్సిపల్లోని అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండలాల అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ కమిటీలు, మున్సిపల్ వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు మండల కమిటీలు, మున్సిపల్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. టీఆర్ఎస్ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, కమాల్రెడ్డి, అనిల్ పాల్గొన్నారు.