వికారాబాద్, ఫిబ్రవరి 9 : శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు, మీడియా సమన్వయంతో పని చేయాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కత్తి కన్న కలం గొప్పదని, మీడియా అనేది సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. ప్రజల గొంతుకను వినిపించే అక్షరం అని, జర్నలిస్టులు సామాజిక బాధ్యత తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, మత్తు పదార్థాలు, గుట్కా, గంజాయి తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలను నివారించి పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ పెంచి గంజాయి, గుట్కా, మట్కా, ఇసుక అక్రమ రవాణా తదితర కార్యకలాపాలను కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నాకాబందీ లాంటి కార్యక్రమాలను కొనసాగించడమే ఈ సంవత్సరం తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఏ.రశీద్, డీటీసీ అదనపు ఎస్పీ అశ్వక్, తాండూరు, వికారాబాద్, పరిగి డీఎస్పీలు లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, శ్రీనివాసులు, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, పోలీస్ అధికారులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.