పరిగి, జూలై 15 : గ్రాంటుగా రూ.10లక్షలు అందజేసే ఏకైక పథకం దళితబంధు అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలో చౌడాపూర్ గ్రామానికి చెందిన పరిగి శ్రీను, దోమ మండలం మల్లేపల్లికి చెందిన నెత్తి ఈశ్వర్కు దళితబంధు పథకం కింద మంజూరైన ట్రాక్టర్లను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా అభివృద్ది సాధించాలనే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రగతి సాధించేలా యూనిట్ ఎంపిక దగ్గర నుంచి గ్రౌండింగ్ ఆ తర్వాత సైతం అధికారులు మరింత శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు.
ఇన్నాళ్లు వివిధ పనులు చేపట్టిన వారందరు నేడు ఆయా రంగాలలో ఏర్పాటు చేసే యూనిట్ల ద్వారా యజమానులుగా మారారని పేర్కొన్నారు. దళితుల సంక్షేమానికి అంకిత భావంతో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాలని ఆయన కోరారు. లబ్దిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పరిగి, కులకచర్ల ఎంపీపీలు కె.అరవిందరావు, సత్యమ్మ, కులకచర్ల జెడ్పీటీసీ రాందాస్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.