షాబాద్, మార్చి 3 : దేశం గర్వించదగ్గ బృహత్తర కార్యక్రమం మన ఊరు-మన బడి, మన బస్తీ కార్యక్రమమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రంగారెడ్డిజిల్లాలోని మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని దీన్దయాళ్నగర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థుల మధ్యలో కూర్చుని లెక్కలు, ఇతర సబ్జెక్టులపై ఆరా తీశారు. మీర్పేట్ బాలుర ప్రాథమిక పాఠశాలను, చల్లా లింగారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలనూ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి కార్యక్రమానికి ఈ నెల 8న వనపర్తిలో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.7289 కోట్ల వ్యయంతో మూడు దశల్లో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ. 3500కోట్లతో 60శాతం విద్యార్థులు చదివే 9123 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువాలని, ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, శానిటేషన్ ప్రక్రియను తరచుగా పరిశీలించాలని స్థానిక కార్పొరేటర్కు సూచించారు. నూతనంగా ఒకటో తరగతి గది నిర్మించనున్నట్లు తెలిపారు. మన ఊరు-మనబడిలో భాగంగా అభివృద్ధి చేయనున్న చల్లా లింగారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టాల్సిన పనుల గురించి పలు సూచనలు చేశారు. పాఠశాలలో గ్రీనరీ, తాగునీరు, ఫర్నిచర్ తదితర వాటిని సమకూర్చి, రంగులు వేసి తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు కళ్లలాగా చూస్తూ ముందుకు వెళ్తున్నదని మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి బాటలు వేస్తూ మంత్రి పలు పనులకు శ్రీకారం చుట్టారు. రూ.90లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు, ఓపెన్ జిమ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రదాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా నియమితులై అభివృద్ధి ప్రదాత అయ్యారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణాలకు నూతన హంగులు ఏర్పడినట్లు తెలిపారు. కోట్లాది రూపాయల నిధులతో పట్టణాల అభివృద్ధి చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. కాలనీల్లో కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఇటీవల ఒకే రోజు నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో రూ.371 కోట్లతో పెద్దఎత్తున అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. పనులు నాణ్యతగా చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.