పరిగి, మే 6 : బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపులో మహిళలు ముందున్నారని, 97 శాతం సజావుగా చెల్లిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. అందువల్లే స్వయం సహాయక సంఘాలకు రుణ పరిమితి పెంచేందుకు బ్యాంకర్లు సైతం ముందుకు వస్తున్నారని చెప్పారు. శుక్రవారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సబ్సిడీపై సీలింగ్ ఫ్యాన్లను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. రుణాలు సద్వినియోగం చేసుకొని వ్యాపారాభివృద్దితో పాటు ఆర్థికంగా మహిళలు ఎదుగుతున్నారని చెప్పారు. మరింత ఆర్థిక ప్రగతి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రభుత్వం ఐ.కె.పి. ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాలు ఆర్థిక ప్రగతిని సాధించేందుకు కృషి చేస్తుందన్నారు.
మొదటి విడతలో 500 సీలింగ్ ఫ్యాన్లు సబ్సిడీపై అందజేస్తున్నారని, రెండో విడతలో మరింత మందికి అందజేయనున్నారని చెప్పారు. మహిళల అభివృద్దికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. అంతకుముందు పరిగిలోని బాలికల ఉన్నత పాఠశాలలో నెస్లే ఇండియా లిమిటెడ్ సహకారంతో ఏర్పాటుచేసిన మూడు మరుగుదొడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి,ఎంపీపీలు కరణం అరవిందరావు, అనుసూజ, మల్లేశం, సత్యమ్మ, జెడ్పీటీసీలు బి.హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్, మార్కెట్ చైర్మన్ ఎ.సురేందర్, ఎంపీడీవో శేషగిరిశర్మ తదితరులు పాల్గొన్నారు.