పరిగి, ఫిబ్రవరి 9 : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పరిగి మున్సిపాలిటీకి ఇచ్చింది గుండుసున్నా అని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి ఎద్దేవా చేశారు. పరిగి మండలంలో బహిరంగసభ నిర్వహించి సీఎం రేవంత్రెడ్డి పరిగికి ఒక్క రూపాయి ప్రకటించలేదని ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సోమవారం వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 3, 7, 13, 14 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు కాట్రావత్ సామ్య, తుమ్మలబావి సునిత, సమీనాబేగం, అనెం సరితల తరపున బీఆర్ఎస్ పరిగి మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జీ ఎం.ఎన్.శ్రీనివాస్రావుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో పరిగి మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులేమి ఇవ్వలేదన్నారు.
ఎన్నికలపుడే రైతుబంధు వేస్తున్నారని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం మరిచారని, పించన్ల పెంపు అటకెక్కిందని, మూడు నెలల పించన్ ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ సర్కారుదన్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిగి మున్సిపాలిటీకి మొదటి విడతలో రూ.15కోట్లు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేయగా పలు ప్రధాన రోడ్ల వెడల్పుతోపాటు వార్డులలో అభివృద్ది చేశామన్నారు. రెండవ విడతలో రూ.25కోట్లు మంజూరు చేయగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయని, ఆ తర్వాత వాటి టెండర్లు పూర్తి చేసేందుకు ఈ సర్కారుకు రెండేళ్లు పట్టిందంటేనే పరిగి అభివృద్దిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత శ్రద్ద ఉందో తెలుస్తుందన్నారు.
పరిగి మున్సిపాలిటీలో వరుసగా ఈసారి సైతం గులాబీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కరణం అరవిందరావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు మీర్ మహమూద్అలీ, బి.శ్రవణ్కుమార్రెడ్డి, మంగు సంతోష్కుమార్, శశాంక్రెడ్డి, ప్రదీప్కుమార్రెడ్డి, తాహెర్అలీ, అజయ్, అన్వర్హుస్సేన్, ఆనెం నర్సింలు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.