బొంరాస్పేట, ఫిబ్రవరి 26 : కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరంగా మారింది. కంటి సమస్యలు తీరుతుండడంతో ప్రజల కండ్ల నిండా ఆనందం నిండుతున్నది. ప్రైవేటు దవాఖానలకు వెళ్లాలంటే డబ్బులేక ఇబ్బందులు పడేవాళ్లమని, ‘కంటి వెలుగు’తో ఉచితంగా పరీక్షలు చేసి కండ్ల అద్దాలు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో కంటి వైద్య శిబిరాలకు జనం నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గత నెల నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 1,56,254 మందికి కంటి పరీక్షలు చేశారు. కంటి చూపుతో బాధపడుతున్న 26,401 మందికి రీడింగ్ గ్లాసెస్, దూరపు చూపు ఉన్న 18,961 మందికి కండ్ల అద్దాల కోసం ఆర్డర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ‘కంటి వెలుగు’ వంటి అద్భుత కార్యక్రమాన్ని చేపట్టినందుకు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టింది. 2018 ఆగస్టులో నిర్వహించిన మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమంతో లక్షలాది మందికి కంటిచూపు మెరుగైంది. దాదాపు నాలుగేండ్లుగా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన మందులు వాడి, కండ్లద్దాలు పెట్టుకుని తమ పనులు తాము చేసుకుంటున్నామని వృద్ధులు సంతోషంగా ఉన్నారు. అదే స్ఫూర్తితో మరింత మంది కండ్లలో కాంతులు నింపడానికి ప్రభుత్వం గత నెలలో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 19వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం వంద రోజులపాటు కొనసాగనున్నది. జూన్ వరకు నిర్వహించే రెండో విడుత కంటి వెలుగులో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు వైద్య బృందాలు పర్యటించి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లాలో 42 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. గత నెల నుంచి నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
శిబిరాలకు వచ్చిన ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి వారికున్న దృష్టిలోపాన్ని బట్టి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేస్తున్నారు. వీటితోపాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ మాత్రలు, కండ్లలో వేసుకోవడానికి చుక్కల మందును అందజేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కంటి వెలుగు వైద్య శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయడమే కాకుండా ఉచితంగా మందులు, కండ్లద్దాలు పంపిణీ చేయడంతో ప్రజలు ముఖ్యంగా పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు దవాఖానలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని కళ్లద్దాలు తీసుకోవాలంటే వేల రూపాయలు ఖర్చయ్యేవని, ప్రభుత్వం గ్రామాల్లోనే శిబిరాలను నిర్వహించి ఉచితంగా కంటి పరీక్షలు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 26401 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ…
వికారాబాద్ జిల్లాలో గత నెల నుంచి ఈ నెల 24వ తేదీ వరకు నిర్వహించిన కంటి వెలుగు వైద్య శిబిరాల్లో 1,56,254 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటిచూపుతో బాధపడుతున్న 26,401 మందికి కండ్లద్దాలు (రీడింగ్ గ్లాసెస్), దూరపు చూపు ఉన్న 18,961 మందికి కండ్లద్దాలను ఆర్డర్ చేశారు. వీరికి కూడా త్వరలో కంటి అద్దాలు పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 144 గ్రామాలు, మున్సిపాలిటీల్లోని 34 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు.
కంటి చూపు సరిగా లేకపోవడంతో కంటి వెలుగు శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. వైద్యులు కంటి పరీక్షలు చేసి అద్దాలు ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు కండ్లు బాగా కనబడుతున్నాయి. ప్రైవేటులో అయితే రూ.2 వేలు ఖర్చు అయ్యేది. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం మంచిగా ఉంది. పేద ప్రజలకు ఇది ఎంతో ఉపయోగం.
–కెతావత్ లక్ష్మీబాయి, మద్దిమడుగుతండా, బొంరాస్పేట
కంటి వెలుగుతో మాలాంటి పేదోళ్లకు ఎంతో లాభం. పైసా ఖర్చులేకుండా కంటి పరీక్ష చేసుకొని అద్దాలు తీసుకున్నా. ప్రైవేటు దవాఖానల్లో చూయించుకుంటే రూ.2 వేలు పెట్టాల్సి వచ్చేది. మా తండాలోనే కంటి పరీక్షలు చేసి వెంటనే అద్దాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వచ్చి మమ్మల్ని పలకరించి కంటి పరీక్షలు చేసుకోమనడంతో ఆనందం వేసింది.
–దేనీబాయి, పాతకొడంగల్ తండా, కొడంగల్