ముంబై, ఆగస్టు 2 : వడ్డీరేట్లు తగ్గుతాయి..ఆర్థిక ఉపశమనం కలుగుతుందని ఆశించిన వారికి ఈసారి కూడా నిరాశే ఎదురుకావచ్చు. రిజర్వుబ్యాంక్ ఆగస్టు నెల ద్రవ్యపరపతి సమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని అత్యధిక మంది ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన ఆగస్టు సమీక్ష ఈ నెల 3న ప్రారంభమై 5న నిర్ణయాన్ని ప్రకటించనున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో క్రూడాయిల్ ధరలు ఇంకా గరిష్ఠ స్థాయిలోనే కదలాడుతుండటం, దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ధరల సూచీ రివ్వున ఎగిసింది. దీంతో వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను యథాతథ స్థితికే సెంట్రల్ బ్యాంక్ మొగ్గుచూపే అవకాశాలున్నాయని పది మంది ఆర్థికవేత్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.38 శాతానికి ఎగబాకడంతో ఆర్బీఐ ప్రస్తుతం వేచి చూసే దోరణి అవలంబించవచ్చునని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను సెంట్రల్ బ్యాంక్ 5.1 శాతానికి పెంచిందని, నిజానికి ద్రవ్యోల్బణం అదుపునకు సంబంధించి ఆర్బీఐ లక్ష్యం 4 శాతంగా పెట్టుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దీనిని సవరించింది. ఆహారోత్పత్తులు రివ్వున దూసుకెళ్లడంతో ఆర్బీఐకి వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం సన్నగిల్లిందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ..ద్రవ్యోల్బణం నియంత్రించడమే తమ ప్రధాన లక్ష్యమని, దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే సానుకూల వర్షాలు కురుస్తుండటంతో భవిష్యత్తులో తగ్గే అవకాశం కూడా ఉందని ఇటీవల వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాదికాలంలో రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను 1.25 శాతం వరకు తగ్గించిన విషయం తెలిసిందే.
దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో వర్షాలది కీలకపాత్రని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో ఎక్కువమంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల భారీగాను, మరికొన్నిచోట్ల ఆశించిన స్థాయిలో కురువడం లేదని ఒకింత ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు, దేశ వృద్ధిరేటు భారీగా పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదని వారు అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడం, ఇంధన ధరలు భగ్గుమనడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం కూడా వృద్ధికి బీటలు పడే అవకాశాలు మెండుగావున్నాయన్నారు. అలాగే ద్రవ్యోల్బణం ముప్పు, వడ్డీరేట్ల పెరుగుదల, కీలక రంగాల్లో నిస్తేజం, జీడీపీ వృద్ధిరేటు క్షీణత, నిరుద్యోగం వంటి సమస్యలకు దారితీస్తున్నది. మరోవైపు ఎల్ నినో కారణంగా ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే జరిగితే పంటల సాగు, దిగుబడి ప్రభావితమై ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటే వీలున్నది. ఆర్బీఐ ఇప్పుడు ఈ అంశాలపైనే ఆందోళన చెందుతున్నది.