వికారాబాద్, డిసెంబర్ 24 : గ్రామాల్లో నెల కొన్న సమస్యలను పరిష్కరించేందుకే మీతో నేను కార్యక్రమం నిర్వహించామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూర్ గ్రామంలో మీతో నేను కార్యక్రమం ద్వారా గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ..తెలంగాణ స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి స్వయంగా గ్రామ పంచాయతీలకు ప్రత్యేకమైన నిధులు మంజూరు చేస్తున్నది. గ్రామ స్వరాజ్యంతో అభివృద్ధి బాటలు వేస్తుందన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు సెల్ఫోన్ వాడుతున్నారని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకరావడంతో ఎమ్మెల్యే డీఈవోతో మాట్లాడారు. తరగతి గదులలో ఉపాధ్యాయులు ఫోన్లు వాడకుండా చూడాలని ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, అందుకు బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని వివరించారు. గ్రామంలోని విద్యుత్ సమస్యలు పరిష్కారం చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని విద్యుత్ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ లీకేజీలు లేకుండా సిద్దులూర్ గ్రామానికి సరిపడా నీరు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, సర్పంచ్ అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీటీసీ గౌస్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు గఫార్, ఆయా శాఖల అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.