పరిగి, జూన్ 28 : కుంటల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం ఇబ్రహీంపూర్ గ్రామం శివారులో రూ.10లక్షలతో కుంట నిర్మాణ పనులను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెరువులు, కుంటల నిర్మాణం ద్వారా ఆయా ప్రాంతాలలో భూగర్భ జలాల వృద్ధికి దోహదం చేస్తాయన్నారు. అలాగే ఉపాధిహామీ కూలీలకు పని లభిస్తుందని చెప్పారు. ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో మరో కుంట నిర్మాణ పనులకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉపాధిహామీ కూలీ డబ్బులు ఎలా వస్తున్నాయని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పనిచేసినా తమకు డబ్బులు టెక్నికల్ అసిస్టెంట్ తక్కువగా వేస్తున్నారని కూలీలు తెలిపారు. అనంతరం మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ప్రకృతివనం చుట్టూ పెద్ద మొక్కలు నాటాల్సిందిగా సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీడీవొ శేషగిరిశర్మ, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, విష్ణువర్దన్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, బాలయ్య, అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.