ధారూరు, డిసెంబరు 21 : గ్రామంలోని ప్రతి ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మీతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ధారూరు మండల పరిధిలోని గడ్డమీది గంగారం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామస్తుల భాగస్వామ్యం ఉండాలన్నారు. గ్రామంలో ప్రధానంగా విద్యుత్ సమస్య ఉన్నందున అధికారులతో మాట్లాడి విద్యుత్ సమస్యలు త్వరలో పరిష్కారం కావాలని ఆదేశించారు.
గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా కొవిడ్ వాక్సినేషన్ టీకా తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో కొంత మందికి రెవెన్యూ సమస్యలు ఉన్నాయని వాటిని రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరించాలని అదేశించారు.
కార్యక్రమంలో ధారూరు వైస్ ఎంపీపీ విజయ్కుమార్, గ్రామ సర్పంచ్ అమర్నాథ్, ధారూరు తహాసీల్దార్ బీమయ్యగౌడ్, ఎంపీవో షఫీఉల్లా, మండల వ్యవసాయశాఖ అధికారి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.