వికారాబాద్ : అతివేగం అజాగ్రత్తతో ఆటో నడుపుతూ ఓ బాలున్ని ఢీకొట్టిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ రాజీవ్ గృహ కల్పకు చెందిన హన్మంతు, లక్ష్మీబాయిల కుమారుడు ఆకాశ్ (13) సోమవారం రోడ్డు పక్కన నడుచుకుంటు వెళ్తున్నాడు. కాలనీ సమీపంలో ఉన్న అంబికాదేవి గ్యాస్ గోదాం నుంచి ఆటో గ్యాస్ సిలిండర్లను తీసుకుని డెలవరీ కోసం బయలు దేరింది. ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డు పక్కన వెళ్తున్న బాలుడిని వెనుక నుంచి ఢీ కొట్టి తలపై నుంచి వెళ్లాడు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు వికారాబాద్లోని ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు.
పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆటో డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మంగళవారం గ్యాస్ గోదాం ఎదుట కాలనీ వాసులతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.