వికారాబాద్ : దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళ వారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు పథకం లబ్ధిదారుడు వికారాబాద్ మండలం ద్యాచారం గ్రామానికి చెందిన యాదయ్యకు ట్రాక్టర్ ను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. రూ.10 లక్షలు అందించి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కామాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ధ్యాచారం సర్పంచ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.