KTR | నీళ్లున్నా ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌజ్ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ బృందాన్ని జనగాం జిల్లా పెంబర్తి వద్ద బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సర్కార్ వైఫల్యం బయటపడుతోందనే మమ్మల్ని అడ్డుకుంటున్నారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి సందర్శనకు వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను, సర్కార్ చేతగానితనాన్ని తెలంగాణ ప్రజలకు చూపెడతామని అన్నారు. నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండగట్టే కుట్రలు చేస్తున్న రేవంత్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని ఎండగడతామని అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ పోలీసులను పెట్టి ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా తప్పకుండా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటాం..
వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను రైతులకు చూపెడుతాం..
నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ దుర్మార్గపు… pic.twitter.com/OOV0W8FEo9
— BRS Party (@BRSparty) July 5, 2026
కేటీఆర్ కాళేశ్వరం కన్నెపల్లి పంప్హౌజ్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్లో వణుకుపుట్టింది. బీఆర్ఎస్ బృందం కన్నెపల్లికి వెళ్లకుండా అడుగడుగునా పోలీసులను పెట్టింది. హైదరాబాద్-వరంగల్ హైవే మీద పోలీసులు భారీగా మోహరించారు. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతుల వాహనాలను అడ్డుకుంటున్నారు. మరోవైపు కేటీఆర్ పర్యటనకు వెళ్లకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.