పరిగి, సెప్టెంబర్ 30 : తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వమే అధికారికంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకువచ్చిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు.
శుక్రవారం పరిగి మండలం చిగురాల్పల్లి, రాఘవాపూర్ గ్రామాలలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ అని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఊరువాడల అంతటా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పండుగను అందరు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడచులందరికీ బతుకమ్మ చీరలు అందజేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో సంబురంగా బతుకమ్మ పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, ఎంపీడీవొ శేషగిరిశర్మ, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, సర్పంచ్లు నల్క జగన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.