వికారాబాద్, మే 28: 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. బుధవారం పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుండి జూన్ 13వ తేదీ వరకు ఉదయం 9-30 గంటల నుండి నిర్వహించనున్నట్లు తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లాలో 20 పరీక్ష కేంద్రాల్లో 5308 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో 20 కేంద్రాల్లో పరిగి-3, తాండూర్-7, కొడంగల్-1, వికారాబాద్-5, మోమిన్ పేట్-2, కుల్కచర్ల-2 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనునట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలన్నారు.
పరీక్ష కేంద్రం వద్ద అత్యవసర మందులతో పాటు ఏఎన్ఎం, సిబ్బంది నియమించాలని వైద్యాధికారికి సూచించారు. అదేవిధంగా ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్లు, ఫ్యాన్లు ఉండే విధంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష సమయాలను దృష్టిలో పెట్టుకొని బస్సులను నడిపించాలని తెలిపారు. మాస్ కాపీయింగ్ కు అవకాశం ఇవ్వకూడదన్నారు.
ఈ సమన్వయ సమావేశంలోడీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్ వెంకటరవణ, ఆర్టీసీ డిపో మేనేజర్ అరుణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.