పరిగి, ఏప్రిల్ 18 : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతిఒక్కరూ పాటించాలని వికారాబాద్ ఆర్డీవో ఎం.వాసుచంద్ర పేర్కొన్నారు. గురువారం పరిగిలోని తహసీల్దార్ కార్యా లయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల కోడ్ అమలుకు సంబంధించి మూడు ఎఫ్ఎస్టీ బృందాలు నిరంతరాయంగా పర్యటిస్తున్నాయని పేర్కొన్నారు.
ఫ్లెక్సీలు, జెండాలు ఇండ్లపై పెట్టినయెడల ఇంటి యజమానులతో రాయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్లో భాగంగా ఎక్కడైనా నలుగురు మించి గుమికూడరాదని అన్నారు. సభలు, ర్యాలీలకు సంబంధించి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి తహసీల్దార్ ఆనంద్రావు, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సంతోష్, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
దోమ: చేవెళ్ల నియోజకవర్ల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు, వాటి పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ తదితర అంశాలతో కూడిన ఎన్నికల సమాచారాన్ని మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు 36 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సమాచార పత్రాలను డిస్ప్లే చేసినట్లు తహసీల్దార్ పురుషోత్తం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చిన సమాచారాన్ని తెలుసుకొని పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు.