ధారూరు : రైతులు యాసంగిలో వరిపంటకు బదులు లాభదయాకమైన ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లీనింగ్ యంత్రం పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సూచించారు.
ఈ యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా వరి కొనుగోలు చేయడం లేదని స్పష్టంగా చెప్పినందున, రైతులు వరి పండించి నష్టపోకుండా వరికి బదులు మండలంలో అనుకూలమైన రాగి, కుసుమలు, మినుములు, పెసర, నువ్వులు, జోన్నలు, తదితర పంటలు పండించి మంచి లాభాలు అర్జించాలని సూచించారు. మార్కుఫెడ్ సంస్థ వారు ఇట్టి పంటలను మంచి ధరకు కొనుగోలు చేయుటకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. చెరువు కింద ఉన్న 200 ఎకరాల భూమిలో ఇతర పంటలు వేయుటకు వీలు పడదని, కోతుల కారణంగా ఇతర పంటలు వేస్తే నష్టపోతామని తెలుపగా… కలెక్టర్ స్పందిస్తూ కోతుల సమస్యలు తీరుస్తామని, ఇంటి వినియోగం కోసం మాత్రమే వరి పండించుకోవాలని రైతులకు సూచించారు.
పంట మార్పిడికి తగిన సూచనలు సలహాలను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా పౌర సరపరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, ధారూరు మండల వ్యవసాయ అధికారి జ్యోతి, తాసిల్దార్ బీమయ్యగౌడ్, ధారూరు గ్రామ సర్పంచ్ చంద్రమౌళి, మండల రైతు సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ రుద్రారం వెంకటయ్య, నాయకులు అంజయ్య, చిన్నయ్యగౌడ్, సిబ్బంది రైతులు ఉన్నారు.