వికారాబాద్ : బాల్య వివాహాల నిర్మూళనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ కోర్టు 12వ అదనపు న్యాయమూర్తి వై. పద్మ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మంగళవారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 12వ అదనపు న్యాయమూర్తి వై. పద్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల భవిష్యత్లో ఆడ పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. శారీరక, మానసికస్థితి సక్రమంగా ఉండి, ఉన్నత స్థాయికి చేరుకున్న తరువాత వివాహాలు చేసుకుంటే జీవితం సుఖవంతంగా ఉంటుందన్నారు. అనుకున్న లక్ష్యాలను చేరుకుని గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని సూచించారు.
చిన్నారులకు ఎక్కడైన వేదింపులు, అన్యాయాలు జరిగినా 100 డయల్ చేసి రక్షణ పొందాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ బాల్యవివాహాలు చేసుకోమని విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజ్, డీఎస్పీ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.