Karur Stampede | తమిళనాడు సీఎం విజయ్కి మద్రాస్ హైకోర్టు నుంచి గట్టి షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగాలని, కేవలం అర్హత మరియు నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలు దక్కాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన తాత్కాలిక నియామక ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.
అసలు ఏం జరిగిందంటే.. గతేడాది విజయ్ టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, బాధితులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఇటీవల 32 మందికి తాత్కాలిక ఉద్యోగ పత్రాలు అందజేసింది. అయితే, నిబంధనలను పక్కనపెట్టి నియామకాలు చేపట్టారంటూ ఆల్ ఇండియా అన్నా ద్రవిడా మున్నేట్రా కళగం (AIADMK) నేత ఆర్.బి. ఉదయ్కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఉచితంగా పంచిపెట్టేవి కాదని, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC) వంటి రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారానే పారదర్శకంగా భర్తీ ప్రక్రియ జరగాలని పేర్కొంటూ, ప్రభుత్వ చర్యలపై నియంత్రణ లేకపోతే అరాచకత్వం ఏర్పడుతుందని హెచ్చరించింది. దీంతో ఈ తీర్పుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.