వికారాబాద్, జనవరి 10 : అల్లం వెల్లుల్లి లేకుండానే.. నకిలీ పేస్ట్ తయారు చేసి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్న తయారీదారులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వికారాబాద్ పట్టణంలో బుధవారం నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయించేందుకు తీసుకొచ్చారని సమాచారం వచ్చింది.
వెంటనే జిల్లా టాస్క్ఫోర్స్ టీం ఇన్చార్జి ఎస్సై ప్రశాంత్వర్ధన్, పట్టణ సీఐ శ్రీను సిబ్బందితో కలిసి డైమండ్ హోటల్ దగ్గర వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒక ట్రాలీలో ఓ వ్యక్తి తీసుకొస్తున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాటన్లను గుర్తించారు. ఆ వ్యక్తిని విచారించగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో తయారు చేసిన కల్తీ అల్లం వెల్లుల్లిని కొని ఇక్కడ విక్రయించేందుకు తీసుకొచ్చానని తెలిపారు. 5 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాను రూ.200 విక్రయిస్తున్నట్లు తెలిపారు.
వెల్లుల్లి పొట్టు, యాసిడ్స్, కెమికల్స్ వాడి అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్లో తనిఖీ చేసి మరో వ్యక్తి నుంచి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న 30 కాటన్లు, 30 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిగిన నాలుగు చిన్న డ్రమ్ములు, కెమికల్స్, యాసిడ్స్ స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో వికారాబాద్ టౌన్ సీఐ శీను, టాస్క్ఫోర్స్ ఎస్సై ప్రశాంత్వర్థన్ ఉన్నారు.