‘కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.. ఈసీ, మూసీ నదులు, చెరువులు, వాగుల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారుల గస్తీ పెంచాం..’ అని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాపై భారీ వర్షాల ప్రభావం, చేపడుతున్న సహాయక చర్యలపై ‘నమస్తే తెలంగాణ’తో తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే..
వర్షం, వరదతో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టడంతోపాటు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే 7995061192 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వానలతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున నివారణ చర్యలు చేపడుతున్నాం.
-వికారాబాద్, జూలై 21, (నమస్తే తెలంగాణ)
జిల్లాలో నాలుగు రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మూసీ, కాగ్నా, ఈసీ నదు లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చెరువులు నిండుకుండలా మారగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు మండలాల్లోని పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. ముసురుకు శిథిలావస్థకు చేరిన పలు ఇండ్లు నేలకూలాయి. అదేవిధంగా ధారూ రు మండలంలోని దోర్నాల్, పరిగి సమీపంలో, కోట్పల్లి, తాండూరు మండలం బెల్కటూర్ వాగు, గాజీపూర్ వాగు పొంగిపొర్లుతుండడంతో ధారూర్-దోర్నాల్, పెద్దేముల్-తాండూరు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా లో అత్యధికంగా కులకచర్ల మండలంలో 16 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే వర్షాలతో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా తీసుకున్న చర్యలు, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తు న్నారు.. పంట పొలాల్లో నీరు చేరిన రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై కలెక్టర్ నారాయణరెడ్డితో నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ..
-వికారాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ):
జిల్లాలో నాలుగు రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తున్న ది. అత్యధికంగా కులకచర్ల మండలంలో 16 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షాలు, వరదలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఎక్కడా ఎలాంటి అనుకొని ఘటనలు జరుగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఇప్పటికే అప్రమ త్తం చేశాం. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి 24 గం టలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రజలు అత్యవసర సమయాల్లో 7995061192 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయొచ్చు. జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) మొదలుకొని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్, విద్యుత్తు, వ్య వసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఘటనలు జరిగినా తక్షణమే స్పందించేలా అవసరమైన చర్యలు చేపట్టాం. వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద ప్రజలు వెళ్లకుండా పోలీస్-రెవెన్యూ సిబ్బంది పహారా పెట్టాం. ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి ప్రమాదకర ఘటనలు జరుగలేదు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు.
కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు మండలాల్లోని పంట పొలాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. రైతులు అధైర్యపడకుండా ఉండేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు. పంట పొలాల్లో మురుగు నీరు ఉండకుండా వెంటనే తీసివేయాలని చెబుతున్నారు. పత్తికి సంబంధించి వర్షాలు తగ్గిన వెంటనే ఎకరాకు 25 కిలోల యూరియా, 20 కిలోల పోటాష్తోపాటుగా 20 రోజుల వయస్సున్న పంటకు మొక్కల మొదళ్లలో 7-10 సెం.మీటర్ల దూరంలో పాదులు తీసి ఎరువులు వేసి కప్పాలని సూచిస్తున్నారు. మొక్కజొన్న లేత దశలో అధిక నీటిని తట్టుకోలేదు కాబ ట్టి వెంటనే తీసివేయాలని రైతులకు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో కురుస్తున్న వానతో పలు మండలాల్లో దాదాపుగా తొమ్మిది ఇండ్లు నేలకూలాయి. కులకచర్ల మండలంలో ఐదు ఇండ్లు, యాలాల మండలం లో ఒకటి, తాండూరు మండలంలో ఒక ఇల్లు, నవాబుపేట మండలంలో రెండు ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా మరో 95 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి శిథిలావస్థకు చేరిన ఇండ్లను ముందే గుర్తించి దాదాపుగా ఇప్పటివరకు 45 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.
జిల్లాలో కురుస్తున్న వర్షం వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాం.ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలోనూ విద్యుత్తు సరఫరా నిరంతరాయంగా ఉండేలా సంబంధిత అధికారులు చూస్తున్నారు. కేవలం ఒక్క గ్రామానికి మాత్రమే విద్యుత్తు సరఫరాలో అంతరాయం నెలకొనగా మరుసటి రోజే విద్యుత్తు సిబ్బంది మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. వర్షాలతో జిల్లాలో 52 స్తంభాలు దెబ్బతినగా, మరమ్మతులు చేపట్టారు. మరోవైపు గ్రామాల్లో విద్యుత్తు ప్రమాదాలు జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాం.
వర్షాల నేపథ్యంలో గ్రామాలు, మున్సిపాలిటీల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ సిబ్బంది అవసరమైన చర్యలు చేపట్టారు. చెత్తాచెదారం వెంటనే తీసివేసేలా, మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఇప్పటికే ఆదేశించాం. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జ్వర లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే స్థానిక పీహెచ్సీలో చికిత్స అందించేందుకు అవసరమైన మందులన్నింటినీ అందుబాటులో ఉంచారు. అత్యవసర ప్రమాదం జరిగితే వెంటనే తరలించేందుకు 108 వాహనాలను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది.