ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కళాశాలల్లో సకల సౌకర్యాలు సమకూరడం, అనుభవజ్ఞులైన లెక్చరర్లు ఉండడంతో కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన అందుతున్నది. జిల్లావ్యాప్తంగా 9 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, 4,500 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే ప్రతి కళాశాలలోనూ సిలబస్ పూర్తికాగా, రివిజన్ ప్రక్రియ కొనసాగుతున్నది.
ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాల సాధనకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణతో పాటు వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకుని తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఎంసెట్, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్, నీట్ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. అత్యధికంగా తాండూరు జూనియర్ కాలేజీలో 1185 మంది విద్యార్థులు ఉన్నారు.
– వికారాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. వెనుకబడిన విద్యార్థుల దత్తత, ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితర కార్యక్రమాలను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేపట్టారు. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుండడంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సకల వసతులు కల్పించడంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పూర్వ వైభవం వచ్చింది.
కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో కంటే మంచి విద్యార్హతలు కలిగిన అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉండడం, సొంత భవనాలు ఉండడం, ఉచిత విద్య, ఉచితంగా పుస్తకాలు తదితర వసతులు కల్పిస్తుండడంతో తిరిగి ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం తరగతులు లేకున్నా పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అధిక మొత్తంలో విద్యార్థులు చేరడం గమనార్హం.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సీసీ కెమెరాలతోపాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తుండడంతోపాటు డిజిటల్ విధానంలో బోధనను కూడా పలు కాలేజీల్లో ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చారు. జిల్లావ్యాప్తంగా 9 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా.. 4500 వేల మంది విద్యార్థులున్నారు. మరోవైపు దౌల్తాబాద్, బషీరాబాద్ మండలాలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మంజూరుకాగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సిలబస్ పూర్తికాగా, రివిజన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా సన్నద్ధం చేస్తున్నారు. గతేడాది 60 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 80 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు దీటుగా గత ఐదేండ్లుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
కాలేజీలు ప్రారంభమయ్యే ఆగస్టు నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉదయం గంట, సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 9.45 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులతోపాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను లెక్చరర్లు దత్తత తీసుకొని మరీ మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ఏ సబ్జెక్టులో అయితే ఉత్తీర్ణత శాతం తక్కువ వస్తుందో సంబంధిత లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని కూడా సంబంధిత ఉన్నతాధికారులు హెచ్చరిస్తుండడంతో ప్రతి కాలేజీలో ఉత్తీర్ణత శాతం పెరిగేలా చర్యలు చేపడుతున్నారు.
మేధోవంతులైన అధ్యాపకులు ఉండడంతో పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం ప్రైవేట్ కాలేజీల కంటే అదనంగా సర్కార్ జూనియర్ కాలేజీల విద్యార్థులు సాధిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కాలేజీల్లో చేర్చుకోవడం, ఉచితంగా అన్ని కోర్సులకు సంబంధించిన పుస్తకాలను అందజేయడం, ప్రాక్టికల్స్కు సంబంధించి ల్యాబ్ మెటీరియల్ అందజేయడం, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానంతో రోజురోజుకూ విద్యార్థుల శాతం పెరుగుతున్నది. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తుండడంతో అధ్యాపకులు, విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్హతలు కలిగిన అధ్యాపకులతో బోధనతోపాటు ఇంటర్ అనంతరం ఇంజినీరింగ్, మెడికల్కు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు కూడా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ఎంసెట్, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్, నీట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ గంటసేపు ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేకంగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులను సిద్ధం చేస్తుండడంతో గతేడాది జరిగిన ఎంసెట్ ప్రవేశ పరీక్షల్లో జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు 30 ర్యాంకులు సాధించడం గమనార్హం.
ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సకల సదుపాయాలతోపాటు మంచి విద్యార్హతగల అధ్యాపకులతో బోధన జరుగుతున్నది. ఈ విద్యా సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నాం. ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే సిలబస్ పూర్తయింది. సంక్రాంతి తర్వాత ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో రెండో ప్రీ ఫైనల్ పరీక్షలను కూడా నిర్వహించి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులయ్యేలా చర్యలు చేపట్టాం.
– శంకర్నాయక్, ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి