మొయినాబాద్ : ప్రజల సౌకర్యార్థం మూసీ నదిపై వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అవ్వగానే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ప్రజా సమస్యలను తీసుకోవడానికి శ్రీకారం చుట్టిన శుభోదయం కార్యక్రమంలో భాగంగా రెండో విడుత బుధవారం మండల పరిధిలోని చిన్నమంగళారం, వీరన్నపేట గ్రామాల్లో పర్యటించారు. ఆయన ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సర్పంచ్ గడ్డమీది సుకన్య, ఎంపీటీసీ సభ్యుడు బట్టు మల్లేష్తో కలిసి గ్రామంలోని ప్రతి వీదిలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు మీ కుటుంబానికి అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులను కలిసి ఆసరా పింఛను వస్తుందా అని అడుగగా వస్తుంది అని చెప్పారు.
గోపులారం-చిన్నమంగళారం మధ్య ఉన్న మూసీ నదిపై వంతెన లేకపోవడంతో ప్రజలు నది నుంచి తమ అవసరాల కోసం రాకపోకలు సాగించడంతో వాగులో మునిగి మృతి చెందుతున్నారని ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రావడం లేదని ప్రజలు చెప్పారు. మొయినాబాద్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం వలన పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు శ్రీకాంత్, బట్టు రాజమల్లేష్ ఎమ్మెల్యేను కోరారు. గ్రామంలో ఇనుప విద్యుత్ స్తంభాలు ఉన్నాయని, వాటిని మార్చమని విద్యుత్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న విద్యుత్ ఏఈ తిరుపతిరెడ్డిని పిలిచి వెంటనే ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నమంగళారం-సీ గోపులారం గ్రామాల మధ్య ఉన్న మూసీ వాగుపై వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. దీపావళి తరువాత వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించడం జరిగిందని కాని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో పోస్టు ఫోన్ అయ్యిందని తెలిపారు. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే డిసెంబర్ నెలలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. గతంలో ఎంతోమంది పాలకులు ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ప్రజల అవసరాలను బట్టి వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం జరిగిందని, వంతెన నిర్మాణం పూర్తి అయితే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. ప్రజా సమస్యలను తెలసుకోవడం కోసం నేరుగా మీ గ్రామంలోనికి, మీ ఇంటి వద్దకు వచ్చామని పేర్కొన్నారు.
గ్రామంలోని ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను దశల వారిగా పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ అనిత, ఏవో రాగమ్మ, డాక్టర్ శ్రీలత, ఎంపీడీవో విజయలక్ష్మి, పీఆర్ డీఈ విజయ్కుమార్, ఆర్ఐ పాండు, ఉప సర్పంచ్ గోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, సీనియర్ నాయకులు నర్సింహరెడ్డి, సంగరి మల్లేష్, హరిశంకర్గౌడ్, విష్ణుగౌడ్, ఆండ్రూ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఏసుదాస్, నాయకులు నర్సింహగౌడ్, జైపాల్రెడ్డి, రాఘవేందర్యాదవ్, రవీందర్, రాజుగౌడ్, పద్మారావు, రాములు, శంకరయ్య పాల్గొన్నారు.