కొడంగల్, మార్చి 27 : పోలింగ్ పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ కోటిరెడ్డితో కలిసి పట్టణంలోని కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటైన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పోలింగ్ కేంద్రంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలను అందించారు.
ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల జాబితా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో మొత్తంగా 56 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేయాలని.. ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, అధికారులను మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రం ఎదుట, చుట్టుపక్కల పూర్తిస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరా ఏర్పాట్లతోపాటు విధిగా వీడియో ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రంలోని సమాచారాన్ని చేరవేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న పది పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ జరుగకుండా చర్యలు తీసుకోవాలని, సెంటర్లో అబ్జెక్టివ్ టైప్ చెప్పడం వంటివి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఈ మాదిరిగా జరిగిన సమాచారం ఉందని, కాబట్టి ప్రత్యేకంగా పరిశీలన చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం కడా కార్యాలయంలో ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్రావు, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేశ్వర్రావు, తహసీల్దార్ విజయ్కుమార్ తదితరులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బోర్ మోటర్లు, చేతి పంపులన్నింటికీ మరమ్మతులు చేయించి తాగునీటి సరఫరాకు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఉన్నవాటితో గడిపేద్దామని నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
అనివార్య కారణాల వల్ల మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేసేలా కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో మంచినీటి సమస్య తల్తెకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీవో ఉషశ్రీ, మున్సిపల్ కమిషనర్ బలరాం, వ్యవసాయాధికారి శంకర్రాథోడ్, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో రాములు, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ పాల్గొన్నారు.
వికారాబాద్ : ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు I VOTE FOR SURE నినాదంతో పట్టణంలో ఎన్నెపల్లి చౌరస్తా నుంచి అలంపల్లి చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన 5కే రన్ను ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల కోసం ఓటర్ కార్డుల సవరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకుగాను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు ఉన్నవారు ముందుగానే ఓటర్ జాబితాలో ఓటు ఉందా లేదా అని ఆన్లైన్లో చెక్ చేసుకోవాలన్నారు. కులమతాలకు అతీతంగా డబ్బు, మద్యం, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఓటింగ్ శాతం పెంచడానికి ‘స్వీప్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, పార్లమెంటు ఎన్నికల్లో జిల్లాలో 80 శాతం ఓటింగ్ పెరిగేలా అందరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. అదనపు కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. ‘నేను తప్పక ఓటు వేస్తాను’ అనే కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికీ ఓటు హక్కుపై అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి సత్తార్, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.