పరిగి : ఉపాధి కల్పన పెంపొందించేందుకు, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలు నుంచి గూగుల్ మీట్ ద్వారా రైతులకు పంటరుణాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల లబ్దిదారులకు ఉపాధి కల్పన రుణాలపై డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత బ్యాంకు అధికారులు, సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించారు. జిల్లాలో పంట రుణాల కింద డిసెంబర్ నెలాఖరుకు యాసంగి కాలంలో రూ. 363కోట్లు, వానాకాలం రూ. 814కోట్లు పంట రుణాలు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొత్తం పంట రుణాల లక్ష్యం రూ. 1715కోట్లు కాగా రూ. 1177కోట్లు రుణాలు మంజూరు చేసి 69శాతం లక్ష్యం సాధించడం జరిగిందని చెప్పారు.
విద్యా రుణాల కింద జిల్లాలో రూ. 140కోట్లు లక్ష్యం కాగా రూ. 81కోట్లు విద్యారుణాలు అందించి 58శాతం లక్ష్యం సాధించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు రూ. 3037కోట్లు రుణాలు మంజూరు చేసి 65శాతం, చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పారిశ్రామిక రంగాలకు రూ. 517కోట్లు రుణాలు మంజూరు చేసి 62శాతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. డిసెంబర్ నెలాఖరుకు జిల్లాలో బ్యాంకుల ద్వారా రూ. 2478కోట్లు డిపాజిట్లు, రూ. 4055కోట్లు రుణాల ద్వారా మొత్తం రూ. 6,533 కోట్లు వ్యాపారం నిర్వహించినట్లు తెలిపారు. 2015-16 సంవత్సరం నుంచి పెండింగ్లో గల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రుణాలను ఈ నెలాఖరు వరకు మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్సీ-128, ఎస్టీ-95, మైనారిటీ-55 పెండింగ్ రుణాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు.
మూడు దఫాలుగా ఈ సమావేశానికి హాజరు కాని యూనియన్ బ్యాంకు అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై తగు చర్యలు చేపట్టాలని ఎల్డీఎం రాంబాబుకు కలెక్టర్ సూచించారు. అనంతరం రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నాబార్డు డీడీఎం ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ఫిబ్రవరి 14నుంచి 18 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా డిజిటల్ గో-సక్సెస్సై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీవో పూర్ణిమ, ఎల్డీఎం రాంబాబు, ఎస్బీఐ కో-ఆర్డినేటర్ రామ్మూర్తి, డీఆర్డీవో కృష్ణన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, సంక్షేమ శాఖ అధికారులు, మెప్మా పిడి రవి, ఏడీఏ స్వరూపరాణి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ యూసఫ్అలీ, హెచ్డీసీసీబీ డీజీఎం సతీష్రెడ్డి, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.