వికారాబాద్ : ప్రజలకు క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీగణ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని పాత డీఎంహెచ్వో కార్యాలయంలో వైద్యాధికారులకు నోడల్ అధికారులకు క్షయవ్యాధి నూతన విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ శ్రీగణ మాట్లాడుతూ క్షయ వ్యాధి ఉన్న రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ముందస్తు చికిత్సలు చేయాలన్నారు. కొత్త విధానం ద్వారా ఇతరులకు వ్యాధులు సోకకముందే వారికి సరైన చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో క్షయవ్యాధి నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
అనంతరం స్టేట్ డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్ శ్రీగణకు, గతంలో విధులు నిర్వహించిన డీఎంహెచ్వో సుధాకర్షిండే, ప్రస్తుత డీఎంహెచ్వో తుకారంకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్యాదవ్, మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయిబాబ, ఎంహెచ్సీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లలిత, కొవిడ్ కో ఆర్డినేటర్ డాక్టర్ అరవింద్, డీఐవో డాక్టర్ జీవరాజ్, తాండూరు డిప్యూటీ డీఎంహెచ్వో ధరణికుమార్, జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్లు, నోడల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.