వ్యవసాయ రంగానికి తెలంగాణ సర్కార్ అధిక ప్రాధాన్యత కల్పిస్తుంటే.. రైతు వ్యతిరేక పార్టీ అధికారంలోకి వచ్చినంక రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామని ఆ పార్టీ నేతలు చెప్తుండటం సిగ్గుచేటు. దేశంలోనే 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ. రైతు వ్యతిరేక పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవని రైతులు పేర్కొంటున్నారు.
పంటలు సాగు చేయాలంటే కరెంట్ సరిపోను ఉండాలని, అప్పుడే పంటలు ఎండిపోకుండా సకాలంలో చేతికొస్తాయని చెబుతున్నారు. కరెంట్ కోతలతో రాత్రిపూట పొలాల వద్ద నిద్రించే రోజులొస్తాయని పేర్కొన్నారు. అధికార పార్టీతోనే 24 గంటల కరెంటు సాధ్యమంటున్నారు రైతులు. అదే విధంగా ధరణి పోర్టల్తో అనేక భూ సమస్యలు సమసిపోయాయని, అసమర్థ పార్టీలు అధికారంలో వచ్చి ధరణిని తీసేస్తామని చెబుతున్నాయి. ఇలా చేస్తే భూములు కబ్జాకు గురయ్యే అవకాశముందంటున్నారు. అంతేకాకుండా భూమిని కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలన్నా దళారుల జోక్యం అధికమవుతుంది. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి పట్టాదారులకు అన్యాయం చేస్తారంటున్నది జిల్లా రైతాంగం.
పంటలు ఎండినయ్..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేళ అసమర్థ పార్టీలు నెరవేరని హామీలను ఇస్తూ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయి. 60 సంవత్సరాలు గత ప్రభుత్వాల పాలనలో రైతులు ఏనాడు సంతోషంగా జీవనం సాగించలేదు. రైతులు పంటలు పండక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 24గంటల కరెంట్ వస్తుంది. పంటలకు సరిపోను నీరు అందితుంది.
– గోవర్ధన్రెడ్డి, ప్రొద్దటూర్ గ్రామం (శంకర్పల్లి)
ధరణితో రెవెన్యూ సమస్యలు తీరాయి..
ఎంతో కాలంగా రెవెన్యూ భూ సమస్యలతో రైతులు ఇబ్బంది పడ్డారు. తెలంగాణ సర్కార్ భూ సమస్యలను పరిష్కరించేందుకు భూ ప్రక్షాళన చేసి ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. ధరణితో సమస్యలు తీరుతున్నాయి. రైతు వ్యతిరేక పార్టీ అధికారంలోకి వచ్చి ధరణిని తీసేస్తే భూ సమస్యలు మళ్లీ పెరిగి దళారుల రాజ్యమవుతుంది.
– శ్రీనివాస్, రాయికల్ (షాద్నగర్రూరల్)
రైతుల సత్తా చూపిస్తాం..
3గంటల కరెంట్ చాలన్న అర్హతలేని పార్టీకి రైతుల సత్తా చూపిస్తాం. తెలంగాణను ఆ పార్టీ నాయకులు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రైతులు పడుతున్న బాధలు చూడలేక తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తూ రైతులకు అండగా నిలిచింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన కరెంటుతో ఒక మడి కూడా తడవకుండే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్తో పంటలు బాగా పండుతున్నాయి. అసమర్థ పార్టీలు అధికారంలోకి వస్తే రాత్రుళ్లు పొలాల వద్ద పాముకాట్లకు, కరెంట్ షాక్లకు గురై రైతులు చనిపోయే ప్రమాదం ఉంది.
– బి.మధు,గణేష్ నగర్ (శంకర్పల్లి)
ధరణి తీసేస్తే భూ రికార్డులు మాయం..
అసమర్థ పార్టీలు ధరణి పోర్టల్ను రద్దు చేసి భూ రికార్డులు మాయం చేయాలని చూస్తున్నాయి. రైతుల జీవితాలను దళారుల చేతిలో పెట్టడానికి ఆ పార్టీలు సిద్ధం అయ్యాయి. తెలంగాణ సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్ తీసుకురావడం ద్వారా దళారులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి రాలేదు. ధరణి రద్దు అయితే రైతులకు కష్టాలు తప్పవు. రైతు వ్యతిరేక పార్టీల మాటలను నమ్మడానికి రైతులు సిద్ధంగా లేరు.
– బండికంటి రమేష్, రైతు, ఇంజాపూర్ (తుర్కయాంజాల్ మున్సిపాలిటీ)
ధరణితో రైతులకు మేలు
దళారుల వ్యవస్థను అంతమొందించేందుకు ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చింది. ధరణితో సామాన్య రైతులకు సైతం సులభంగా తమ భూమికి సంబంధించిన ప్రతి రికార్డును చూసుకునేలా రూపొందించింది. అసమర్థ పార్టీ అధికారంలోకి వేస్తే దళారుల వ్యవస్థ పెరుగుతుంది. రైతుల బాగు కోసం తెలంగాణ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. రైతుబంధుతో పంట పెట్టుబడి సాయం అందుతున్నది.
– వెంకటేష్, సోలిపూర్ (షాద్నగర్)